రైళ్లలో వృద్ధులకు రాయితీ పునరుద్ధరణ.. కొత్త షరతులు ఇవే

Update: 2022-07-27 15:19 GMT
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే శాఖలో వృద్ధులకు రాయితీ ఇచ్చేవారు. కానీ కరోనా నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు ఈ రాయితీ నిలిచిపోయింది. దీన్ని త్వరలోనే పునరుద్దరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ దిశగా భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రైళ్లలో వృద్ధులకు అందిస్తున్న రాయితీలను పునరుద్ధరించనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో వృద్ధులకు అమలు చేసిన రాయితీలకు కొన్ని మార్పులు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  తాజాగా పునరుద్ధరించనున్న రాయితీ 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు మాత్రమే అందనుంది. గతంలో ఈ వయో పరిమితి 58 ఏళ్లుగా ఉండేది. అంతేకాకుండా త్వరలోనే అందుబాటులోకి రానున్న రాయితీ ప్రయాణం జనరల్, స్లీపర్ క్లాసుల్లో మాత్రమే వర్తించనుంది.

ఇక స్లీపర్, జనరల్ తరగతుల్లో ప్రయాణించే వయోవృద్ధులకే రాయితీని పరిమితం చేయడం వెనుక ఓ లాజిక్ ఉంది. రాయితీకి అర్హులైన ప్రయాణికుల్లో 70 శాతం మంది ఈ తరగతుల్లోనే వెళుతుంటారు. అయితే ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు.

కేంద్రం తీరుచూస్తుంటే.. రాయితీలకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేసుకునే ఆలోచనతో నూతన సబ్సిడీ నియమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ రాయితీలు వృద్ధులకు ఉపయోగపడుతాయని వీటిని పూర్తిగా రద్దు చేస్తామని తాము ఎన్నడూ చెప్పలేదని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక అన్నిరైళ్లలో ప్రీమియం తత్కాల్ స్కీమ్ ను తీసుకొచ్చేందుకు రైల్వే కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల ఆదాయం పెరుగుతుందని.. రైల్వేపై పడే రాయితీల భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రస్తుతం సుమారు 80 రైళ్లలో ప్రీమియం తత్కాల్ విధానం అమలులో ఉంది. చివరి నిమిషంలో కాస్త అధిక ధరకు టికెట్ బుక్ చేసుకునే విధానాన్నే ప్రీమియం తాత్కాల్ గా వ్యవహరిస్తున్నారు. ప్రీమియం తత్కాల్ కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తున్నారు.
Tags:    

Similar News