అమిత్ షాను రేవంత్ ఊరికే క‌లిశార‌ట‌..

Update: 2017-05-15 10:22 GMT
తెలంగాణ టీడీపీలో ఏకైక ఆశాకిర‌ణం రేవంత్ రెడ్డి రీసెంటుగా బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాను క‌లవ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు రావ‌డంతో రేవంత్ రెడ్డి తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను అమిత్ షాను క‌ల‌వ‌డం నిజ‌మేన‌ని అంగీక‌రించిన ఆయ‌న త‌న‌కు  బిజెపిలో చేరాల్సిన అవసరం లేదని  చెబుతున్నారు.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే కార్యాచరణను బిజెపి రాష్ట్ర నాయకత్వం చేయడం లేదని.. ఆ పార్టీలో చాలామంది నాయకులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. వివిధ పార్టీలకు చెందిన ప్రజాదరణ గల నాయకులు బిజెపిలో చేరితే ఆ పార్టీ ఏ మేరకు ఆ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ప్రాజెక్టుల్లో అవినీతితో పాటు కెసిఆర్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడుతున్న నాగం జనార్ధన్ రెడ్డి, టిడిపి నుండి బయటకు వెళ్లిన సంకినేని వెంకటేశ్వర్ రావు, గండ్ర సత్యనారాయణరావు , యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నాయకుల పరిస్థితి బిజెపిలో ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. మరో వైపు ఎన్నికలకు ముందే బిజెపితో కలిసి తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. అయితే అలాంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు .తాము బిజెపితో పొత్తు కోరుకొంటున్నామన్నారు.అయితే బిజెపి నాయకులు మాత్రం టిఆర్ఎస్ తో పొత్తును కోరుకొంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే... బీజేపీని తెలంగాణ బ‌లోపేతం చేయ‌డానికి ఆ పార్టీ ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌న్న రేవంత్ మ‌రి త‌మ పార్టీ బలోపేతానికి చంద్ర‌బాబు ఎంత‌వ‌ర‌కు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న విష‌యంలో మాత్రం ఏమీ మాట్లాడ‌డం లేదు.
Tags:    

Similar News