షర్మిల పార్టీ ప్రభావం ఎంతో చెప్పేసిన రేవంత్

Update: 2021-07-02 05:30 GMT
టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నెలల తరబడి పీసీసీ చీఫ్ ఎవరన్న విషయాన్ని తేల్చకుండా ఉన్న పరిస్థితుల్లో కాస్త కామ్ గా ఉన్న రేవంత్ తాజాగా వడ్డీతో సహా అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తెలంగాణ అధికారపక్షంపై విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లను లక్ష్యంగా చేసుకుంటున్న ఆయన.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. నియంత కిమ్ లా మారాడన్న రేవంత్.. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇస్తే దివాలాగా మార్చాడన్నారు. బంగారు బాతును ఇస్తే కోసుకు తింటున్నారని.. బాప్ ఔర్ బేటావి బడాయి మాటలుగా కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని.. త్వరలోనే ఘర్ వాపసీ ఉంటుందన్నారు. దూకుడుగా వ్యవహరించటం తన లక్షణమని.. అది మారదన్న ఆయన..  కేసీఆర్ పై పదునైన పదజాలాన్ని వాడతానే కానీ గలీజ్ గా మాట్లాడనని చెప్పారు.

తాజాగాఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన షర్మిల పార్టీపై స్పందించారు. ఆమె పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉండే ప్రభావం ఎంతన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అంత ప్రభావం ఉండదని తేల్చేశారు. పార్టీ పెట్టటం వల్ల షర్మిలకు ఎలాంటి లాభం ఉండదని.. నష్టం ఎవరికి జరుగుతుందన్న విషయాన్ని చూద్దామన్న ఆయన.. కుటుంబ సెంటిమెంట్ కంటే కూడా ప్రజల సెంటిమెంట్ చాలా పెద్దదని గుర్తు చేశారు.

2014 ఎన్నికల్లో విజయమ్మ.. షర్మిల.. వారి కుటుంబం కలిసి ప్రచారం చేస్తే వారికి వచ్చింది మూడు ఎమ్మెల్యే.. ఒక ఎంపీ సీటు మాత్రమేనని చెప్పిన ఆయన.. అప్పటి కంటే ఏం అద్భుతం చేశారని వారి కుటుంబానికి అధికారాన్ని కట్టబెడతారని పేర్కొన్నారు. మొత్తంగా షర్మిల ప్రభావం పెద్దగా ఉండదని తేల్చేయటం గమనార్హం.
Tags:    

Similar News