దాసన్న ఇలాకాలో దందా : నరసన్నపేట వైసీపీలో ఇసుక అక్రమార్కులు...?

Update: 2022-07-20 00:30 GMT
ఆయన నిన్నటిదాకా ఉప ముఖ్యమంత్రి. పార్టీలో సీనియర్ నేత. ఇపుడు మాత్రం ఆయన దర్జా  ఏ మాత్రం ఎక్కడా తగ్గలేదు.  జగన్ ఆయన్ని తీసుకువచ్చి శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా చేశారు. ఆయనే ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన సొంత నియోజకవర్గం నరసన్నపేటలో ఇపుడు ఇసుక దందా మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాటిని చేస్తున్న వారు సొంత పార్టీకి చెందిన వారే కావడం విశేషం.

దాసన్న ఇలాకాలో ఇలా అక్రమాలు  జరుగుతోందని, తాము చెబితే తమనే  పార్టీ వాట్సాప్  గ్రూపుల నుంచి తొలగించారని వైసీపీ నాయకులు ముద్దాల బాలభూపాలనాయుడు, పాగోటి రమణా భరద్వాజ్, బుద్దల రాజశేఖర్ ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ దాసన్న ఇలాకాలో దందా భాగోతాలను బయటపెట్టేశారు. వారు విపక్షాలకు చెందిన వారు కారు, దాసన్న అనుచరులే. వారే తమ నియోజకవర్గంలో ఇసుక దందా సాగుతోందని చెప్పడమే విశేషం.

అదెలా అంటే నరసన్నపేట నియోజకవర్గంలో పర్లాం తదితర ఇసుక రేవుల్లో ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోందిట. ఈ దందాను చేయించేవారు వైసీపీ వారే. ఈ ఇసుక రేవులలో వైసీపీ వారే చేరి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని వారు బయటపెట్టారు. ఇలా ఇసుక రేవులను తమ ఆదాయ వనరుగా చేసుకుని కొందరు వైసీపీ నాయకులు దందాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇదంతా దాసన్న కనుసన్ననల్లఒ జరుగుతోందా అని ప్రజలు అనుమానిస్తున్నట్లుగా వారు చెప్పడం బిగ్ ట్విస్ట్.

అంటే అవినీతి అక్రమాలకు వ్యతిరేకమని చెప్పే దాసన్న ఇలాకాలో ఆయనకు తెలియకుండా ఇంత జరుగుతుందా అన్న చర్చ రావడం సహజం. పైగా ఇలా చేస్తున్నారు అని సొంత మనుషులు వైసీపీ నేతలు చెబుతూంటే వారిని పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పించారు అంటే అక్రమాలకు దాసన్న మద్దతు ఇస్తున్నారా అన్నదే వారి అభియోగం.

ఇలా అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దందా నరసన్నపేటలో జరుగుతోందని తాము ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చామని వారు అంటున్నారు. మొత్తానికి ఇది దాసన్నకు అతి పెద్ద సమస్యగానే చూడాలి. అసలే నియోజకవర్గంలో తన వారు చేసిన మకిలి పనుల వల్ల గ్రాఫ్ బాగా తగ్గుతోందని వైసీపీ హై కమాండ్ కి నివేదికలు వెళ్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఇపుడు ఇసుక  దందాలు అంటూ సొంత వారే అవినీతిని బయటపెడుతున్నారు. ఈ సమయంలో అన్న వారిని దండించకుండా నిజంగా అక్రమాలు  జరిగితే దానిలో దాసన్న ప్రమేయం లేకపోతే చక్కదిద్దాలని కోరుతున్నారు. అలా కాకుండా దబాయిస్తూ అడిగిన వారి మీద చర్యలు తీసుకుంటూ పోతే అంతిమంగా నరసన్నపేటలో దాసన్నకే ఇబ్బంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ధర్మాన్ని పాటించే పెద్ద మనిషిగా పేరున్న దాసన్న ఏ చర్యలు తీసుకుంటారో.
Tags:    

Similar News