బ్రేకింగ్: రజినీకాంత్ తో శశికళ భేటి.. తమిళ రాజకీయాల్లో సంచలనం

Update: 2021-12-07 14:33 GMT
తమిళనాడు రాజకీయాలు షేక్ అయ్యాయి. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకేలకు ప్రత్యామ్మాయంగా మరో బలమైన పార్టీ ఆవిర్భవించబోతోందా? అన్న సందేహాలు ఈ కీలక భేటితో మరోసారి చర్చకు వచ్చాయి.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ ఇప్పుడు కొత్త పార్టీకి పురుడుపోస్తున్నట్టుగా తెలుస్తోంది. నాలుగేళ్లు జైల్లో ఉండి ఇటీవలే బయటకు వచ్చిన శశికళ చాపకింద నీరులా కొత్త పార్టీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోందనే ప్రచారం తమిళ రాజకీయాల్లో సాగుతోంది.

రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు శశికళ ఇదివరకే ప్రకటించింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె చేసిన ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఏ పార్టీలోనూ చేరబోవట్లేదని చేసిన ప్రకటన సంచలనమైంది. అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి రావాలన్నదే తన బలమైన కాంక్ష అని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడి డీఎంకే గెలిచింది. స్టాలిన్ సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ శశికళ తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.  అన్నాడీఎంకే అధికారంలోకి రాకపోవడం.. క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో తాను రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో సాగుతోంది.

ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న శశికళ తాజాగా ఈరోజు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. చెన్నై పోయస్ గార్డెన్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. రజినీ ఆరోగ్యం గురించి ఆరాతీశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలోకి నాలుగేళ్ల పాటు శిక్షను అనుభవించి.. బయటకు వచ్చిన తర్వాత శశికళ.. రజినీకాంత్ ను కలుసుకోవడం ఇదే తొలిసారి. రాష్ట్ర రాజకీయాలు, రజినీకాంత్ పార్టీ గురించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ సానుభూతిపరుడిగా ఉన్న రజినీకాంత్ను తన వైపుకు తిప్పుకునేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News