విశాఖకు వచ్చిన సాయిప్రియ.. పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది?

Update: 2022-07-30 05:00 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సాయిప్రియ ఉదంతం తెలిసిందే. పెళ్లైన రెండేళ్లకు.. భర్తతో కలిసి పుట్టింటికి వచ్చి.. బీచ్ లో అనూహ్యంగా ప్రియుడితో కలిసి వెళ్లిపోవటం.. ఆమె సముద్రంలో మునిగి ఉంటుందన్న భర్త మాటతో పోలీసులు రంగంలోకి దిగటం.. అనంతరం హెలికాఫ్టర్.. కోస్టల్ గార్డులతో సముద్రాన్ని గాలించటం లాంటి సినిమాటిక్ సన్నివేశాలతో రెండు రోజులు గడవటం.. ఆ సమయంలో తాను తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయానని.. మళ్లీ పెళ్లి చేసుకున్నట్లుగా తండ్రికి పంపిన మెసేజ్ తో షాక్ తిన్న వైనం తెలిసిందే.

పెను దుమారంగా మారిన సాయిప్రియ ఉదంతానికి సంబంధించి.. తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రియుడ్ని తీసుకొని విశాఖపట్నానికి మళ్లీ వచ్చింది సాయిప్రియ. విశాఖ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె.. తన ప్రియుడ్ని పెళ్లి చేసుకున్నానని.. తామిద్దరం కలిసి ఉంటామని.. తమకు ఎలాంటి హాని కలగకుండా చూడాలంటూ పోలీసుల్ని కోరారు. సాయిప్రియ ఉదంతాన్ని విచారణ చేస్తున్న విశాఖ మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చారు.

సాయిప్రియ.. ఆమె ప్రియుడి నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా సాయిప్రియ తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిచారు. అదే సమయంలో సాయిప్రియ ప్రియుడి తల్లిదండ్రుల్ని కూడా స్టేషన్ కు పిలిచారు. ఇరు కుటుంబాల వారు స్టేషన్ కు రావటం.. వారు చేసిన పనికి తల ఎత్తుకోలేకపోతున్నట్లుగా వాపోయి.. వాళ్లను తమ ఇళ్లకు తీసుకెళ్లేదే లేదని తేల్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రియుడితో కలిసి సాయిప్రియ పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లుగా సమాచారం అందుకున్న మీడియా పెద్ద ఎత్తున స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి సాయిప్రియ బయటకు వెళ్లే సమయానికి మీడియా పెద్ద ఎత్తున చేరటం.. వారు అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన సాయిప్రియ.. స్ప్రహ తప్పి పడిపోయింది.

దీంతో.. ఆమె ప్రియుడి ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు. తమ ఇద్దరి పేరెంట్స్ తమను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవటంతో.. తాము వేరుగా కలిసి ఉంటామని స్టేషన్ లో చెప్పి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News