ఇక పెళ్లి కాని తల్లులు అఫిషియల్ ?!

Update: 2015-10-16 10:46 GMT
జాతీయ మహిళా కమిషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఒంటరి మహిళలు కూడా సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనేలా అనుమతించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి.  సరోగసీకి చెందిన ముసాయిదా బిల్లులో పెళ్లయిన మహిళలు మాత్రమే సరోగేట్ మదర్స్ అయ్యేందుకు అనుమతిస్తూ ప్రతిపాదనలు చేశారు. అది ఒంటరి మహిళల పునరుత్పత్తి హక్కుకు భంగం కలిగించడమేనంటూ జాతీయ మహిళా కమిషన్ కొత్త వాదన లేవనెత్తుతోంది. పెళ్లికానివారైనా - విడాకులు తీసుకున్నవారైనా - విధవరాలైన మహిళైనా ఎవరైనా సరే ఒంటరి మహిళలు కూడా అద్దెగర్భంతో పిల్లలను కనే అవకాశం ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు లలితా కుమారమంగళం అంటున్నారు.

సరోగసీ - ఫెర్టిలిటీ సంబంధిత అంశాలకు చెందిన 'ది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ప్రివెన్షన్ బిల్లు రూపకల్పన యత్నాలు చాలాకాలంగా జరుగుతున్నాయి. ఈ ముసాయిదా బిల్లును తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో ఉంచారు. దీనిపై నవంబరు 15లోగా సూచనలు సలహాలు కోరారు. అందులోభాగంగానే జాతీయ మహిళా కమిషన్ ఇలాంటి సూచనలు చేసింది.

మరోవైపు సుప్రీం కోర్టు మాత్రం సరోగసీపై మండిపడుతోంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సరోగసీ వ్యాపారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అద్దె గర్భాలను అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏమాత్రం చట్టబద్ధత లేకపోయినా దేశంలో ఈ అద్దెగర్భాల వ్యాపారం రోజురోజుకీ పెరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
అంతేకాదు...  ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. ప్రభుత్వం మానవ పిండాల వ్యాపారానికి అనుమతిస్తోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అద్దెగర్భం విక్రయాలతో ముడిపడిన వివిధ అంశాలు, కేసులపై న్యాయమూర్తులు రంజన్‌ గగోయ్‌ - ఎన్‌ వి రమణల ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అద్దె గర్భం అమ్మకాలను చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. అద్దెగర్భాన్ని విక్రయించిన సందర్భాల్లో అండాన్ని దానం చేసిన మహిళ మాత్రమే శిశువుకు తల్లి అవుతుందా? లేకపోతే అద్దెగర్భాన్ని ధరించిన, జన్యుపరమైన మహిళ ఇద్దరినీ తల్లులుగా భావించాలా? అనేదాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది. అద్దెగర్భం తల్లుల కోసం విదేశీయులు పెద్దసంఖ్యలో వస్తున్నందున మనదేశం 'పిల్లల కర్మాగారం'లా మారిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. కాగా అద్దెగర్భాల నియంత్రణకు ప్రభుత్వం త్వరలోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనుందని సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ ధర్మాసనానికి తెలిపారు.

ఢిల్లీ శివారు ప్రాంతాలు - హర్యానా - ఉత్తర ప్రదేశ్ లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళలు దీన్ని ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. వీరికి ఏజెంట్లూ ఉంటూ వారు సరోగసీని ప్రోత్సహిస్తున్నారు. సరోగసీ కారణంగా ఎన్నో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు... తమది కాని బిడ్డకు తాము జన్మనిస్తున్నామని ఎంతగా సర్దిచెప్పుకుంటున్నా నవమాసాలు మోసి కన్నందుకు చాలామంది మహిళలు ఆ బిడ్డలను వదులుకోలేకపోతున్నారు. ఒక్కోసారి ఇవి కేసులవుతుండగా.. కొన్ని సందర్భాల్లో ఆ మహిళలు మానసికంగా కుంగిపోవడానికి కారణమవుతున్నాయి.
Tags:    

Similar News