బాల నేరస్తుడి విషయంలో సుప్రీం ఏమీ చేయల

Update: 2015-12-21 09:04 GMT
చట్టాలకుండే పరిమితులను ఎవరూ ఏమీ అనలేరు. కానీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి.. సరికొత్త దిశానిర్దేశం చేసేలా న్యాయవ్యవస్థలు చొరవ తీసుకుంటే తప్పేం కాదేమో. కానీ.. అలాంటిదేమీ చేయని అత్యున్నత న్యాయస్థానం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులోని బాలనేరస్తుడి విషయంలో చట్టప్రకారమే స్పందించింది. కోట్లాది జనుల నిరసనను చూడలేని.. ఆవేదనను వినలేని న్యాయదేవత చట్టాల్లో నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి నిర్ణయం తీసుకుంది. నిర్భయ ఉదంతంలో మూడేళ్ల జైలుశిక్షకు గురై.. శిక్షాకాలం పూర్తి అయిన నేపథ్యంలో జైలు నుంచి విడుదల చేసే విషయంలో మహిళా సంఘాలు.. బాధిత తల్లిదండ్రుల ఆవేదనను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

కాకుంటే..ప్రజల మనసు తమకు తెలుసని.. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము చట్టానికి కట్టుబడే ఉండాలని.. చట్టం మీరటం ధర్మం కాదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం బాలనేరస్తులకు మూడేళ్లకు మించి జైలుశిక్ష విధించే చట్టం దేశంలో లేదని.. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని సుప్రీం వ్యాఖ్యానించింది.  ఈ నేపథ్యంలో బాలనేరస్తుడి విడుదలపై స్టే ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి.. దీనిపై మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. దారుణమైన నేరానికి పాల్పడిన నిర్భయ ఉదంతంపై కఠిన శిక్షలు వేయాలని.. బాధితులకు న్యాయం చేస్తామంటూ అప్పట్లో ఊరడింపు మాటలు చెప్పిన రాజకీయనాయకులు గడిచిన మూడేళ్లలో చట్టాల్ని ఎందుకు సవరించలేదు? అన్యాయం జరిగింది ఒక సాదాసీదా అమ్మాయికి కావటం వల్లేనా?
Tags:    

Similar News