అల్లుడి ఇంట్లో అత్తకూ పరిహారం పొందే హక్కు: సుప్రీం కీలక తీర్పు

Update: 2021-10-26 06:20 GMT
మాములుగా ఏదైనా ప్రమాదంలో వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు, లేదా తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. అయితే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హురాలేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా అతనికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఆమె కూడా అర్హురాలే అవుతుందని తేల్చి చెప్పింది.

కేసు వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. దీంతో బాధితుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, కాబట్టి కుటుకబ సభ్యులకు రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అల్లుడిపై ఆధారపడి, అతని ఇంట్లోనే ఉంటున్న అత్త కూడా పరిహారం పొందేందుకు అర్హురాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అల్లుడు, కుమార్తె వద్ద అత్త నివసించడం భారత సమాజంలో అసాధారణ విషయమేమీ కాదని, వృద్ధాప్యంలో పోషణ కోసం అల్లుడిపైనా ఆధారపడుతుంటారని పేర్కొంది. అతడు మరణించినప్పుడు ఆమె తప్పకుండా ఇబ్బందులు పడుతుందని తెలిపింది. కాబట్టి పరిహారం పొందేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం అల్లుడికి ఆమె చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు పైన పేర్కొన్న మొత్తానికి 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పు అల్లుడిపైన ఆధారపడ్డ అత్తలకు ఉపశమనంగా భావించాలి.
Tags:    

Similar News