టి20 ప్రపంచ కప్.. కాబోయే పరుగుల వీరుడెవరంటే..

Update: 2022-10-22 00:30 GMT
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 ప్రపంచ కప్ సూపర్ 12 దశ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు జరిగాయి. శుక్రవారంతో ఈ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక శనివారం సూపర్ 12 లో ఆతిథ్య ఆస్ట్రేలియా, దాని పక్కనే ఉండే న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఆస్ట్రేలియా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగు పెడుతోంది. ఇక హాట్ ఫేవరేట్ లలో ఒకటైన ఇంగ్లండ్.. అండర్ డాగ్ అఫ్గానిస్థాన్ ను ఢీకొననుంది. అయితే, అత్యంత కీలమైన, టోర్నీకే ఆకర్షణీయం అనదగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది.

ఆ సామర్థ్యం ఎవరికుంది? ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ప్రపంచ కప్ ఎప్పుడా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికితోడు టోర్నీ తొలి రోజుల్లోనే భారత్ -పాక్ మ్యాచ్ ఉండడంతో ఆసక్తి మరింత పెరిగింది. నిరుటికి ఈ నాటికి పరిస్థితులు మారాయి. సరిగ్గా 11 నెలల కిందట జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారత్ కు విరాట్ కోహ్లి కెప్టెన్. టి20లకే కాక అన్ని ఫార్మాట్లలోనూ అతడే సారథి. కానీ, నిరుటి ప్రపంచ కప్ తర్వాత టి20 పగ్గాలు వదిలేసిన కోహ్లి.. అన్ని ఫార్మాట్ల నుంచీ తప్పుకొన్నాడు. ఇక ఆ తర్వాత బాధ్యతలు రోహిత్ శర్మ చేతికి వచ్చాయి. కాగా, టి20 ప్రపంచ కప్ మొదలవుతుందంటేనే ఈసారి పరుగుల వీరుడు ఎవరా? అనే ప్రశ్న రాకమానదు.

వీరంతా బీభత్స బ్యాటర్లే..భారత్ లో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియాలో వార్నర్, కామరాన్ గ్రీన్, మ్యాక్స్ వెల్, మాథ్యూ వేడ్, ఇంగ్లండ్ లో బట్లర్, హేల్స్, డేవిడ్ మలన్, లివింగ్ స్టన్,
పాకిస్థాన్ లో బాబర్ ఆజామ్, మొహమ్మద్ రిజ్వాన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో టాప్ బ్యాటర్లు. వీరు ఒక్కసారి కుదురుకుంటే ఆపడం ఎవరి తరమూ కాదు. మరోవైపు టి20 ఫార్మాట్ లో తమదైన రోజు రోహిత్ శివతాండవం ఆడేస్తాడు. అయితే, ఇప్పుడతడు కాస్త పరుగుల వేటలో వెనుకంజలో ఉన్నాడు.

కోహ్లి.. పూర్వపు ఫామ్ ను వెదుక్కుంటున్నాడు. మిగతా జట్ల బ్యాటర్లు టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడే వారు కాదు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ టాప్ స్కోరర్ ఎవరంటే.. అందరి ఓటు పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ కే పడుతోంది. భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడెవరో అంచనా వేశాడు. అయితే.. అతడు భారత ఆటగాడు కాకపోవడం గమనార్హం. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. 'బాబర్‌ ఆజామ్‌ బ్యాటింగ్‌ బ్రిలియంట్‌గా ఉంటుంది. అతడి ఆటను చూడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. కోహ్లీ బ్యాటింగ్‌ను తలపిస్తుంది. అతడి ఆట తీరును మీరు ఆస్వాదిస్తారు' అని అన్నాడు.

బాబరేనా? సెహ్వాగ్ జోస్యం నిజమవుతుందా..?

టెక్నిక్, నిలకడను చూసి సెహ్వాగ్.. బాబర్ కు ఓటు వేసి ఉండొచ్చు గానీ.. ప్రస్తుతం బాబర్ ఫామ్ అంత గొప్పగా ఏమీలేదు. అతడి కంటే రిజ్వాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. వికెట్ కీపర్ గా బాధ్యతలు నెరవేరుస్తూ మరీ చెలరేగుతున్నాడు. ఓపెనర్ గా వస్తూ జట్టులో త్రిముఖ పాత్ర పోషిస్తున్నాడు. విశ్లేషించి చూస్తే పాక్ జట్టులో ప్రస్తుతం అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్నది రిజ్వానే. కానీ, బాబర్ ను అంత తేలిగ్గా ఏమీ తీసివేయలేం. అతడూ పరుగుల బాట పడితే ఆపలేం. చూద్దాం మరి ఏంజరుగుతుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News