అక్కాచెల్లెళ్ల‌పై అత్యాచారం.. ఆపై చెట్టుకు ఉరి!

Update: 2022-09-15 12:05 GMT
గ‌త కొన్నేళ్లుగా అత్యాచారాల‌కు, నేరాలుగా అడ్డాగా నిలుస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఘాతుకం చోటు చేసుకుంది. మైన‌ర్ల అయిన ఇద్ద‌ర అక్కాచెల్లెల‌ను దుండ‌గులు గ్యాంగ్ రేప్ చేసి ఆపై చెట్టుకు ఉరేశారు. నిందితులు బాలిక‌ల గ్రామానికి చెందిన‌వారేన‌ని చెబుతున్నారు. త‌న‌ను పెళ్లి చేసుకోవ‌డానికి నిరాక‌రించింద‌ని ఒక‌డు మిగిలిన త‌న స్నేహితుల‌తో క‌లిసి అక్కాచెల్లెళ్ల మీద గ్యాంగ్ రేపి చేశాడ‌ని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో లఖింపుర్‌ ఖేరీ జిల్లాలో చోటుచేసుకొన్న ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ యూపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళ్తే.. లఖింపుర్‌ ఖేరీ జిల్లాలోని లాల్‌ పుర్వా గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల (17, 15 ఏళ్ల వ‌య‌సు వారు)ను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంతకాలంగా పెళ్లి చేసుకోమని బ‌ల‌వంతం చేస్తున్నారు. ఆ యువకులను పెళ్లి చేసుకునేందుకు అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ ఒప్పుకోలేదు. దీంతో ఆ ఇద్ద‌రిపై కోపం పెంచుకున్న యువకులు తమ మిత్రులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సెప్టెంబ‌ర్ 14న బుధవారం మధ్యాహ్నం నిందితులిద్ద‌రూ ఆ బాలికలను మాట్లాడాలని చెప్పి బైక్‌లపై ఎక్కించుకున్నారు. ఆ త‌ర్వాత వారిని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోసారి పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. అక్కాచెల్లెల్లిద్ద‌రూ ఒప్పుకోలేదు.

దీంతో ఆ ఇద్ద‌రు యువ‌కుల‌తోపాటు వీరి స్నేహితులు మ‌రో ఇద్ద‌రు మొత్తం నలుగురు యువకులు మైన‌ర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు ఉరితీశారు. బాలికలు ఇంట్లో క‌నిపించ‌కపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు.

అయితే బాలిక‌ల ఇంటికి కిలోమీటర్‌ దూరంలోనే ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించ‌డంతో కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు బాలికల పొరుగింటి వ్యక్తే అని తెలిసింది.

ఘటనకు పాల్పడిన నలుగురు యువకులతో పాటు అందుకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దర్యాప్తు నిమిత్తం వెళ్లిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. గ్రామస్థులు గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొలుత అక్కాచెల్లెళ్లను కిడ్నాప్‌ చేసినట్లు వార్తలు రాగా.. పోలీసులు వాటిని ఖండించారు.

కాగా ఇద్ద‌రు బాలిక‌లు దళితులు కావ‌డంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నిస్తూ ఇతర రాజకీయ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమని మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ అగ్ర నేత‌ ప్రియాంక గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

కాగా గతంలో కూడా లఖీంపుర్ ఖీరీ వార్తల్లో నిలిచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఉద్య‌మం చేస్తున్న‌ రైతులపై జీపు ఎక్కించారన్న ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఈ జిల్లా వార్త‌ల్లో చోటు చేసుకుంది. ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News