ఎమ్మెల్సీలుగా గోరటి - బస్వరాజు - దయానంద్
ప్రజాకవి.. ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని గళం వినిపించిన తెలంగాణ గాయకుడు గోరటి వెంకన్నను కేసీఆర్ అందలమెక్కించారు. ఉద్యమకారులకు పదవులు ఇవ్వడం లేదన్న అపవాదును చెరిపేస్తూ.. దుబ్బాక ఓటమి తర్వాత సీఎం కేసీఆర్ తాజాగా ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. అందులో గోరటి వెంకన్నతోపాటు బీసీ, ఆర్యవైశ్యులకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన మంత్రివర్గం తాజాగా ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం అడ్వయిజర్, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ ల పేర్లను ఖరారు చేశారు.ఈ ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. రేపు శనివారం ఉదయం 11 గంటలకు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకన్న పేరును టీఆర్ఎస్ ఆమోదించింది.. ఇటీవల వెంకన్న సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో అందుకే కలిశారు.
తాజాగా నియామకాల్లో ఒక ఎస్సీ వర్గానికి,రజక, ఆర్యవైశ్యలకు పదవులు ఇచ్చి కేసీఆర్ సమన్యాయం చేసినట్టు తెలుస్తోంది. ఈ నియామకాలతో ఇక ఉద్యమకారులకే ఇక పదవులు అని కేసీఆర్ తేల్చినట్టు అయ్యింది. బస్వరాజు సారయ్య ప్రముఖ రజక నాయకుడు. వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఇక దయానంద్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్యవైశ్యుల సంఘం సలహాదారు. వారి హక్కుల కోసం పోరాడుతూ టీఆర్ఎస్ లో 2014లో చేరి కృషి చేస్తున్నారు.