బ్రేకింగ్: ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్?

Update: 2020-06-23 06:30 GMT
మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అందరికీ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా క్రీడాకారులకు సోకింది. భారత్ తోపాటు పొరుగున ఉన్న పాకిస్తాన్ లో కూడా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. అక్కడ జనం సామాజిక దూరం లాంటివి ఏవీ పాటించకపోవడంతో అందరికీ విస్తరిస్తోంది.

తాజాగా ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు మహమ్మారి పాజిటివ్ రావడం కలకలం రేపింది.పాకిస్తాన్ క్రికెటర్లు హైదర్ అలీ, హరీష్ రవూఫ్, షాదాబాద్ లు ఈ వైరస్ బారిన పడ్డారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇంగ్లండ్ టూర్ కు వెళ్లేముందు రావల్పిండిలో ఆదివారం క్రికెటర్లందరికీ మహమ్మారి టెస్టులు నిర్వహించారు. వారిలో మహమ్మారి లక్షణాలు కనిపించకున్నా వైరస్ పాజిటివ్ గా తేలడం విశేషం. వెంటనే ఈ ముగ్గురు క్రికెటర్లను హోం క్వారంటైన్ కు పంపినట్లు పీసీబీ తెలిపింది.

ఇక ముగ్గురు క్రికెటర్లకు మహమ్మారి పాజిటివ్ రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. మరికొందరు ఆటగాళ్లు, అధికారులకు కరాచీ, లాహోర్, పెషావర్ లలో ఈరోజు టెస్టులు నిర్వహించింది. వారి రిపోర్టులు రేపు వస్తాయి. ఇందులో ఇంకా ఎంతమందికి మహమ్మారి అంటిందో రేపు తెలియనుంది.

ఇప్పటికే పాకిస్తాన్ డ్యాషింగ్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి మహమ్మారి పాజిటివ్ గా తేలింది. అతడు చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు మిగతా క్రికెటర్లలోనూ బయటపడింది.

పాకిస్తాన్ లో ఇప్పటివరకు 1.82 లక్షలకుపైగా మహమ్మారి కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో 3606మంది మహమ్మారితో చనిపోయారు.
Tags:    

Similar News