పంజాగుట్ట పోలీసులకు వీడియో కాల్ చేసి మరీ టీవీ నటి సూసైడ్ అటెంప్ట్

Update: 2022-05-31 04:45 GMT
న్యాయం జరగలేదని టీవీ నటి ఒకరు పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ పోలీసుల్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఉదంతం ఇప్పుడు ఎవరి పీకకు చుట్టుకుంటుందన్నది ప్రశ్నగా మారింది. టీవీ నటి మైథిలి (34) సూసైడ్ అటెంప్టు చేసింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

టీవీ సీరియళ్లలో నటిగా పని చేస్తున్న మైథిలికి భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమీర్ పేట ఎల్లారెడ్డిగూడలోని మూర్తి అపార్టుమెంట్ లోఉంటుందన్న ఆమె గతంలో పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో ఉండేవారు.

ఆర్నెల్ల క్రితం తన బంగారు ఆభరణాలు చోరీ అయినట్లుగా పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసుస్టేషన్ కు తరచూ వచ్చేవారు. తనకు న్యాయం చేయాలని కోరేవారు.

ఈ ఫిర్యాదుకు సంబంధించిన కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు వీడియో కాల్ చేసిన ఆమె.. తనకు న్యాయం జరగటం లేదని ఆరోపిష్తూ.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పారు. వీడియోకాల్ లో పోలీసులు చూస్తుండగానే గుర్తు తెలియనిది ఏదో తాగేశారు.

దీంతో అలెర్టు అయిన పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పందించి.. ఆమె ఉంటున్న నివాసానికి వెళ్లారు. ఆమెను అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నగల చోరీలాంటి కేసుల్లో దొంగ దొరకటం కొంచెం ఆలస్యమవుతుంది. ఇలాంటి కేసులు వెనువెంటనే ఛేదించటం అంత సులువు కాదు. తాజా పరిణామం పంజాగుట్ట పోలీసులకు ఇప్పుడు మింగుడుపడనిదిగా మారింది. ఇప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News