శశికళకు సహకరిస్తున్న ఏపీ లీడర్ ఎవరు?

Update: 2017-02-12 07:02 GMT
క్షణానికో మలుపు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో శశికళ తాను కోరుకుంటున్న సీఎం పదవిని చేపట్టడానికి పట్టు విడవకుండా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె ఎమ్మెల్యేలతో తమిళనాడులోనే ఇంతవరకు క్యాంపు నిర్వహించారు. అయితే.. అక్కడకు కోర్టు ఆదేశాలతో పోలీసులు వెళ్లడం.. ఆ తరువాత ఇప్పుడు ఒక్కరొక్కరు నేతలు శశికళ శిబిరం నుంచి బయటపడుతుండడంతో ఆమె వ్యూహం మార్చారని.. కొందరిని ఆంధ్రప్రదేశ్ కు తరలించారని తెలుస్తోంది. 30 మంది ఎమ్మెల్యేలను ఏపీలోని ఒక రహస్య ప్రాంతానికి తరలించారని చెబుతున్నారు.

అయితే... ఏపీలో 30 మంది తమిళనాడు ఎమ్మెల్యేలను రహస్యంగా ఉంచడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకు ఈ రాష్ట్రానికి చెందిన బలమైన నేతల అవసరం తప్పనిసరి. అలాంటి సహకారం లేకుండా శశికళ ఇక్కడ నెట్టుకు రాలేరు. మరి అలాంటప్పుడు ఏపీలో ఆమెకు సహకరిస్తున్న తెలుగు నేత ఎవరన్న ప్రశ్న వినిపిస్తోంది. శశికళతో మంచి సంబంధాలు ఉన్నవారు కానీ.. ఆమె వెంట ఉన్నవారితో మంచి సంబంధాలున్నవారు కానీ అయితేనే ఇంత పెద్ద బాధ్యత తీసుకుంటారని చెబుతున్నారు. అలాంటి నేత ఎవరై ఉంటారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

 మరోవైపు అసలు వారిని ఏపీలో ఎక్కడ ఉంచారన్నదానిపైనా తమిళనాడులో రకరకాల ప్రచారం జరుగుతోంది. తమిళనాడు బోర్డరులోని చిత్తూరు జిల్లాలో కానీ, ఆ పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడైనా ఉంచి ఉంటారని ఎక్కువ మంది భావిస్తున్నారు. మరోవైపు విశాఖపట్నానికి వారిని తరలించారన్న ప్రచారమూ ఉంది. అదే సమయంలో హైదరాబాద్ లోని అమ్మ రిసార్ట్సు జేజే గార్డెన్ కు తీసుకొచ్చి ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నప్పటికీ అక్కడ అలాంటి హడావుడి ఏమీ లేదు. అయితే.. 30 మంది తమిళ ఎమ్మెల్యేలను ఏపీలో కానీ, హైదరాబాద్ లో కానీ ఉంచాలంటే ఇక్కడి నేతల సపోర్టు మాత్రం కచ్చితంగా అవసరం. ఇదే నిజమైతే శశికళ కోసం అంత పెద్ద బాధ్యత మోస్తున్న ఆ తెలుగు నేత ఎవరై ఉంటారన్నది ఇప్పుడు కీలక ప్రశ్న.
Tags:    

Similar News