వైఎస్‌ వివేకా కుమార్తె సునీతపై పోస్టర్ల కలకలం!

Update: 2023-04-25 15:25 GMT
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హత్య వ్యవహారంలో ఒక్క వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ని మినహాయించి ప్రధాన నిందితులందరినీ సీబీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డి, అవినాష్‌ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకడైన ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను కొద్ది రోజుల క్రితం సీబీఐ అరెస్టు చేసింది.

మరో వైపు అవినాష్‌ రెడ్డి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 24 వరకు అవినాష్‌ ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడం.. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను కొట్టివేయడం వంటి పరిణామాలు జరిగాయి. మరో వైపు అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్‌ 25న విచారణ జరగాల్సి ఉండగా హైకోర్టులో విచారించలేదు.

ఇంకోవైపు వివేకా హత్యలో ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, బావ శివప్రకాష్‌ రెడ్డిల హస్తం ఉందని అవినాష్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. జగన్‌ కు చెందిన సాక్షి మీడియా ఈ అంశం పైనే వరుస కథనాలు ప్రచురిస్తోంది.

ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత టీడీపీలో చేరుతున్నారంటూ కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. వీటిని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారని చెబుతున్నారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్‌ వైఎస్‌ సునీత కు స్వాగతం.. సుస్వాగతం అంటూ టీడీపీ నేతల ఫొటోలు అతికించి ఈ పోస్టర్లను అంటించారు. ప్రొద్దుటూరు పట్టణంలో రాత్రికి రాత్రే ప్రధాన కూడళ్లలో ఈ వాల్‌ పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్లల్లో చంద్రబాబు, వివేకా, సునీత ఫొటోలను ముద్రించడం గమనార్హం.

ఇప్పటికే సునీత, ఆమె భర్త రాజశేఖర్‌.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడానికి సునీత ఏర్పాట్లు చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీత, వివేకా, చంద్రబాబు ఫొటోలతో ప్రొద్దుటూరులో పోస్టర్లు అంటించడం కలకలం రేపుతోంది.

కాగా కొద్ది రోజుల క్రితం వివేకా హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు నిరసన నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు రామచంద్రా రెడ్డి స్వయంగా నల్ల చొక్కా ధరించి భాస్కర్ రెడ్డిని అరెస్టును ఖండిస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయులే వైఎస్‌ వివేకా కుమార్తె సునీతపై పోస్టర్లు అంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివేకా హత్య కేసును డైవర్ట్‌ చేసేందుకే వైఎస్‌ సునీత రాజకీయ ప్రవేశమంటూ వైసీపీ శ్రేణులు పోస్టర్లు అంటించారని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. సునీత పోస్టర్లు ఎవరు అంటిం చారో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పోస్టర్లో టీడీపీ నేతల ఫొటోలు వేశారని.. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Similar News