చిరు వర్సెస్ బాలయ్య.. 2023 సంక్రాంతి రేసులో అదిరిపోయే ట్విస్ట్..!

Update: 2022-10-27 03:30 GMT
గతేడాది చివర్లో నందమూరి బాలకృష్ణ నుంచి 'అఖండ' సినిమా వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య డ్యూరోల్ చేశాడు. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అఘోర పాత్రలో బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశాడు. బోయపాటి డైరెక్షన్.. థమన్ బీజీఎం 'అఖండ'ను నెక్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి.

2021 డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 'అఖండ' ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బొయపాటి-బాలయ్య కాంబినేషన్ మరోసారి హిట్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వీరి కాంబినేషన్లో #NBK107 పేరిట సినిమా ప్రారంభమైంది. ఈ మూవీ టైటిల్ ను ఇటీవలే 'వీరసింహారెడ్డి'గా మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా రానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

2022 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి 'ఆచార్య'.. 'గాడ్ ఫాదర్' చిత్రాలు వచ్చాయి. ఇందులో 'ఆచార్య' చిరంజీవి కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'గాడ్ ఫాదర్' మాత్రం చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్టుగా నిలిచింది.

చిరంజీవి తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా తీసుకరానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

బాలయ్య నటిస్తున్న 'వీరసింహారెడ్డి' దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ పనులకు వెళుతోంది. అయితే చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' షూటింగ్ మాత్రం చాలా పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంటుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ సంక్రాంతికి బాలయ్య సినిమాతో చిరంజీవి పోటీ పడుతారని ఇరువురు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిరంజీవి సినిమా వెనుకడుగు వేస్తే మాత్రం ఫ్యాన్స్ ఊరుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రెండు యూనిట్లుగా తెరకెక్కిస్తున్నాడు. ఒక యూనిట్ ను 'పంతం' దర్శకుడు చక్రవర్తి పర్యవేక్షిస్తుండగా.. మరో యూనిట్ ను బాబీ చూసుకుంటున్నాడట.

ఎలాగైనా 'వాల్తేరు వీరయ్య'ను సంక్రాంతి రేసులో నిలుపేలా బాబీ చర్యలు తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తుండటంతో ఈ రెండు సినిమాలు కొంత గ్యాప్ తో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2023 సంక్రాంతి రేసులో ఎవరు ముందుగా వస్తారనేది ఆసక్తిని రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News