టికెట్ రేట్లు పెంచమని అడిగి అందరం జోకర్స్ అయ్యాం..!

Update: 2022-06-18 08:41 GMT
టాలీవుడ్ లో గత కొంతకాలంగా సినిమా టికెట్ ధరలపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేట్లు తగ్గిస్తూ జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరిగింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి దీనిపై విజ్ఞప్తి చేశారు. ఆ  తర్వాత కమిటీ సిఫారసుల మేరకు ఏపీ సర్కారు టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ చేసింది. తెలంగాణాలో అంతకు ముందే టికెట్స్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా పాండమిక్ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయామని సినీ పెద్దలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. అయితే ఈ పరిణామం RRR - కేజీఎఫ్2 వంటి లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలకు మేలు చేసినప్పటికీ.. మిగతా చిత్రాలకు ప్రతికూలంగా మారింది.

అధిక టికెట్ రేట్ల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. ఎలాగూ మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కదా.. అప్పుడు చూడొచ్చులే అనే భావనకు వచ్చేస్తున్నారు.దీంతో నిర్మాతలు ఓ మెట్టు దిగొచ్చారు. సాధారణ టికెట్ ధరలతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ప్రెస్ మీట్లు - ప్రకటనలు - పోస్టర్స్ వదలాల్సిన పరిస్థితి వచ్చింది.

ఒకప్పుడు రేట్లు పెంచమని అడిగిన వారే.. ఇప్పుడు తక్కువ ధరలతో సినిమాలు విడుదల చేస్తుండటం గమనార్హం.ఈ పరిణామాలపై లేటెస్టుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రేట్లు తగ్గిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు.ధరల పెంపు కోసం పోరాడిన మేమంతా జోకర్లమని అన్నారు.

'కొండా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగి అందరం 100 పర్సెంట్ జోకర్లం అయిపోయాం. అందులో డౌటే లేదు. ఇది పూర్తిగా వైయస్ జగన్ విజయమని చెప్పాలి. దాన్ని డిఫైన్ చేయడం కన్నా మూర్ఖత్వం ఉండదు" అని అన్నారు.

"ఆ టైంలో ఏదో అయిపోతుందని అంతా అకుంటాం. దాని పర్యవసనాలు ఏంటని ఎవరూ ఆలోచించరు. ఆ వీరావేశంలో అందరం రాద్ధాంతం చేసాం. ఆ టికెట్ రేట్లు పెంచారు. రెండు మూడు సినిమాలు ఆడకపోయే సరికి దిగొచ్చాం."

"ప్రజలు టికెట్ రేట్లు భరించలేరు.. అందుకే తగ్గిస్తున్నా అని జగన్ గారు చెప్పారు. ఇప్పుడేమో ధరలు భరించలేకపోతున్నారు. మనమే తగ్గిచ్చేద్దాం అంటున్నారు. అదే తేడా. దీనికి తప్పు అనేది చాలా చిన్న వర్డ్ అవుతుంది. మేం బ్లండర్ చేసాం" అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News