మనం సినిమా సూర్య రీమేక్ చేసి ఉంటే..

Update: 2016-04-19 04:34 GMT
మనం.. తెలుగు ప్రేక్షకులకు ఓ మరపురాని అనుభవాన్ని మిగిల్చిన సినిమా. అక్కినేని కుటుంబం కోసం ఓ అపురూపమైన కథ రాసి.. దాన్ని అంతే అపురూపంగా తెరకెక్కించి.. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా ‘మనం’ను నిలబెట్టాడు విక్రమ్ కుమార్. ఈ కథ ఇంకెవ్వరూ చేసినా దానికి సూటయ్యే వారు కాదేమో. కానీ ఓ తమిళ నిర్మాత మాత్రం ఈ సినిమా చూసి ముగ్ధుడైపోయి.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళంలోకి రీమేక్ చేయాలని అనుకున్నాడట. ఆ నిర్మాత మరెవరో కాదు.. సూర్య కజిన్ జ్నానవేల్ రాజా. సూర్య కుటుంబంలోనూ ముగ్గురు కథానాయకులున్న నేపథ్యంలో ఆ ముగ్గురితో ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడట జ్నానవేల్. కానీ విక్రమ్ తనకు ‘24’ కథ చెప్పి ‘మనం’ గురించి మరిచిపోయేలా చేశాడని అతను వెల్లడించాడు.

‘‘విక్రమ్ తీసిన మనం చూసి మాటలు రాలేదు. వెంటనే నాకు మా నాన్నగారితో మాట్లాడాలనిపించింది. మా నాన్న గారికి ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పాను. ఆయన కూడా సినిమా చూశారు. ఆ తర్వాత ఆయన విక్రమ్ కు ఫోన్ చేసి.. ఈ సినిమాను తమిళంలో సూర్య.. కార్తి.. వీళ్ల తండ్రి శివకుమార్ లతో రీమేక్ చేయమని సలహా ఇచ్చారు. నేను కూడా అదే అన్నాను. ఐతే విక్రమ్ మాత్రం నా దగ్గర ఓ కొత్త కథ ఉంది.. అది వినండి.. నచ్చకపోతే మీరడిగినట్లే ‘మనం’ రీమేక్ చేస్తా అన్నాడు. అప్పుడు సూర్యతో విక్రమ్ కు అరగంట మీటింగ్ ఏర్పాటు చేశాను. ఆయన మాత్రం నాలుగున్నర గంటల పాటు 24 కథ చెప్పారు. అరగంట టైమిచ్చి.. నాలుగున్నర గంటలు కథ విన్నారంటే ఇది సూర్యకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘మనం’ రీమేక్ సంగతి ఆలోచించకుండా ‘24’ మొదలుపెట్టాం’’ అని జ్నానవేల్ చెప్పాడు.
Tags:    

Similar News