ఇవాల్టి నుండి షో షురూ

Update: 2018-03-09 04:28 GMT
సగటు ప్రేక్షకుడికి ఎంతో ఎంటర్ టెయిన్ మెంట్ ఇచ్చే సినిమా వారం రోజులుగా థియేటర్లలో బంద్ అయింది. మొత్తం రెండు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు తలుపులు మూసేయడం అన్నది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లకు.. నిర్మాతలకు మధ్య వచ్చిన భేదాభిప్రాయం పెరిగి పెద్దదై చివరకు థియేటర్ల బంద్ చేసేవరకు వెళ్లింది. చివరకు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మూసుకున్న థియేటర్ల తలుపులు  9వ తేదీ నుంచి తెరుకుంటున్నాయి.

నిర్మాతల డిమాండ్లకు సంబంధించి డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు కొన్నింటికి మాత్రమే ఓకే చెప్పారని ప్రొడ్యూసర్ సురేష్ బాబు అంటున్నారు. ఇప్పటివరకు కుదిరింది తాత్కాలిక ఒప్పందమే అంటున్నారు. టాలీవుడ్ కు సంబంధించి ప్రధానమైన డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లయిన క్యూబ్.. యూఎఫ్ఓలు త్వరలో విలీనం కాబోతున్నాయని.. అవి రెండు మెర్జ్ అయ్యాక మళ్లీ చర్చలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ రెండింటితో విడిగా అగ్రిమెంట్లు చేసుకున్నామని తెలిపారు.

‘‘నిర్మాతల డిమాండ్లు పూర్తిగా తీరకుండానే సమ్మె విరమించడం ఏమింటంటూ కొందరు చేస్తున్న విమర్శలు మాదాకా వచ్చాయి. కానీ ప్రొడ్యూసర్ల డిమాండ్లు అన్నీ తీరిస్తే కంపెనీలు మూసేసుకోయాల్సి వస్తుందని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అంటున్నారు. వారిని మునిగిపొమ్మని చెప్పలేం కదా. చాలా ఏళ్లగా ఇబ్బందులన్నీ ఫేస్ చేశాకే సమ్మె వరకు వెళ్లాం. థియేటర్లు మూసేయాలని మాకెవరికీ ఉండదు’’ అంటూ సురేష్ బాబు సమ్మెకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఏమయినా వారం రోజుల ఇంటర్వెల్ తరవాత ఈ రోజు నుంచి థియేటర్లన్నీ సందడిగా కనిపించనుండటం సగటు ప్రేక్షకుడికి ఆనందం కలిగిస్తోంది.




Tags:    

Similar News