స‌మంత‌ను ఫాలో అవుతున్న రాశీఖ‌న్నా!

Update: 2022-06-24 02:30 GMT
'ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2'లో ఎల్.టి.టి.ఇ తీవ్ర‌వాది రాజీ పాత్ర‌లో న‌టించిన స‌మంత‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర‌తో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరా లో ఎన్నారైల నుంచి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇది అరుదైన గౌర‌వం గుర్తింపు.

స‌మంత‌కు వ‌చ్చిన ఇమేజ్ చూశాక ఇత‌ర స్టార్లు త‌న‌ని అనుస‌రించ‌డం మొద‌లు పెట్టారు. వెబ్ సిరీస్ ల‌తో జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తుంద‌న్న హోప్ తో ప‌లువురు ఆ దిశ‌గా ప్ర‌యాణిస్తున్నారు. ఇప్పుడు రాశీ ఖ‌న్నా కూడా అదే తీరుగా త‌న‌ని తాను కొత్త‌గా ప్రెజెంట్ చేసుకునేందుకు వెబ్ సిరీస్ ని ఆశ్ర‌యించింది. అంతేకాదు.. ఫ్యామిలీమ్యాన్ సృష్టిక‌ర్త‌లు రాజ్ అండ్ డీకే ల‌నే అందాల రాశీ ఆశ్ర‌యించ‌డంతో దీనిపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి.

రాజ్ అండ్ డీకే బృందంతో రాశీ ప‌ని చేయ‌డానికి కార‌ణం త‌న‌కు తానుగా కొత్త ఇమేజ్ ని కోరుకోవ‌డ‌మేన‌ని తెలిసింది. ఇక ఈ సిరీస్ లో షాహిద్ క‌పూర్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న రాశీ న‌టిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. రాశి ఎప్పటికప్పుడు వివరాలను అప్ డేట్ చేస్తూనే ఉంది.

తాజా ఇంటర్వ్యూలో.. షాహిద్ కపూర్ తో రాశీ తన కెమిస్ట్రీ ఒక రేంజులో ప్ర‌జ‌ల హృద‌యాల‌పై విరుచుకుపడుతుందని అతిశ‌యోక్తిగా తెలిపారు. 'ఫర్జీ' సిరీస్ లో త‌మ మ‌ధ్య ఘాటైర రొమాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఒరిజిన‌ల్ కేట‌గిరీలో ప‌లు భాష‌ల్లో అనువాద‌మై విడుద‌ల కానుంది.

రాశీ ఖన్నా ప‌నైపోయింది అని ప్ర‌చారం సాగుతున్న క్ర‌మంలో మళ్లీ గేమ్ ఛేంజ‌ర్ గా మారుతోంది. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతోంది. జూలై 1న విడుదల కానున్న తెలుగు సినిమా పక్కా కమర్షియల్ పై చాలా ఆశలు పెట్టుకుంది.

ఇందులో గోపిచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌తిరోజు పండ‌గే లాంటి హిట్టిచ్చిన మారుతి మ‌రోసారి త‌న‌కో హిట్టిస్తార‌న్న‌ది రాశీ ధీమా. ప్ర‌స్తుతం ప్ర‌చారంలో అంతే స్పీడ్ గా ఉంది ఈ అమ్మ‌డు.
Tags:    

Similar News