మహమ్మారీ లాక్ డౌన్ పీరియడ్ ని స్టార్లు తెలివిగానే సద్వినియోగం చేసుకున్నారు. చాలామంది కథలు ఫైనల్ చేసి స్క్రిప్టు వర్క్ ని పూర్తి చేయించే పనిలో ఉంటే పలువురు ప్రీప్రొడక్షన్ పనులు చక్కబెట్టారు. చాలామంది హీరోలు హీరోయిన్లు వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటయ్యేందుకు స్క్రిప్టులు వినేంత సమయం చిక్కింది. ఓవైపు కుటుంబంతో సమయం గడుపుతూనే స్క్రిప్టులు వినేందుకు వీలు కుదిరింది.
ఇంతకీ సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా ఏం చేసింది? అంటే .. మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి తన ముంబై నివాసంలో కుటుంబంతో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అలాగే ఆన్ లైన్ లో జూమ్ కాలింగ్ ద్వారా దర్శకులు వినిపించిన అనేక స్క్రిప్ట్ లను వింటూనే ఉందిట. ఆమె తదుపరి చిత్రాల నిర్మాతలతోనూ చర్చలు జరుపుతోంది. మరోవైపు తమన్నా మామ్ డాడ్ కి కోవిడ్ సోకడంతో హోం క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసినదే.
ఎన్ని టెన్షన్లు ఉన్నా కాగల కార్యాన్ని మాత్రం తమన్నా విడిచిపెట్టడం లేదు. తాజాగా తమన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. లేత నీలం రంగు చొక్కాలో కనిపించిన మిల్కీ తన మ్యాక్ బుక్ ముందు కూచుని స్క్రిప్టులు వింటున్న ఫోటోని షేర్ చేసింది. ``ఇంటి నుండి పని చేసిన చివరి కొన్ని రోజులు`` అని తమన్నా కోట్ చేసింది. కరోనా మమ్మల్ని విడిచిపెట్టకపోయినా కళాకారులు చివరికి తీవ్ర జాగ్రత్తలతో తిరిగి సెట్స్ పైకి రావాల్సి ఉంటుందని అంది. అన్నట్టు తమన్నా తదుపరి చిత్రీకరణకు సిద్ధమవుతోందని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇక ఈ భామ నటించిన క్వీన్ రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` ఎప్పటికి రిలీజ్ కి వస్తుంది? అన్నదానికి క్లారిటీ లేదు.