మళ్ళీ ఆ దర్శకులతోనే బాలయ్య డబుల్ కాంబో

అందులో ఒకరు 'వీర సింహా రెడ్డి' తీసిన గోపీచంద్ మలినేని కాగా.. మరొకరు 'భగవంత్ కేసరి' సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి అని తెలిసింది.

Update: 2024-10-22 17:30 GMT

సినిమాలను స్పీడ్‌గా చేయడానికి ఏజ్ ఏమాత్రం అడ్డంకి కాదని చాలా మంది హీరోలు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో యంగ్ హీరోల కంటే వేగంగా సీనియర్లే మూవీలను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ మధ్య వరుస హిట్లతో జోరు మీదున్న ఆయన.. ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లుగా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు.

 

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 'సర్కార్ సీతారామ్' అనే టైటిల్‌తో ఇది రాబోతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆయన తన 110వ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నారు. ఇది అఖండకు సీక్వెల్‌గా రాబోతుండడంతో దీనికి 'అఖండ 2.. తాండవం' అనే టైటిల్‌తో రాబోతున్నట్లు ఇటీవలే వెల్లడించారు.

 

ఇప్పటికే రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. మరిన్ని సినిమాలను కూడా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా బాలయ్య తన కొత్త ప్రాజెక్టును ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్నారని టాక్ వచ్చింది. అయితే, దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

నటసింహా బాలయ్య కొత్త సినిమాల గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదేమిటంటే.. తనకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఇద్దరు దర్శకులకు మళ్లీ అవకాశం ఇవ్వబోతున్నారట. అందులో ఒకరు 'వీర సింహా రెడ్డి' తీసిన గోపీచంద్ మలినేని కాగా.. మరొకరు 'భగవంత్ కేసరి' సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి అని తెలిసింది.

క్రేజీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పటికే నందమూరి బాలకృష్ణకు ఓ స్టోరీ చెప్పాడని తాజాగా తెలిసింది. అది ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సన్నీ డియోల్‌తో అతడు చేస్తున్న సినిమా పూర్తైన వెంటనే గోపీచంద్.. బాలయ్యతో చేయబోయే మూవీపై ఫోకస్ చేయబోతున్నాడని ఫిలిం నగర్ టాక్.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడి కూడా నందమూరి బాలయ్యకు సూటయ్యే మరో కథను రెడీ చేస్తున్నాడట. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్.. దీని తర్వాత బాలయ్యనే లైన్‌లో పెట్టుకోబోతున్నాడని సమాచారం. ఇలా ఈ ఇద్దరు దర్శకులు ఏకకాలంతో నటసింహం కోసం పని చేయబోతున్నారు. అయితే, వీళ్లలో ఎవరు ముందు తమ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారో చూడాలి.

Tags:    

Similar News