SSMB29: వావ్.. మహేష్ ఫ్యాన్‌మేడ్ పోస్టర్ అదుర్స్!

ఇందులో మహేష్ లుక్ ఇలా ఉండాలంటూ లెక్కలేనన్ని పోస్టర్లు డిజైన్ చేశారు. లేటెస్టుగా ఓ ఫ్యాన్ మేడ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Update: 2024-10-17 16:08 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. 'SSMB 29'గా పిలవబడుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మూవీ జోనర్ ఏంటనేది తెలియగానే, ఇందులో మహేష్ లుక్ ఇలా ఉండాలంటూ లెక్కలేనన్ని పోస్టర్లు డిజైన్ చేశారు. లేటెస్టుగా ఓ ఫ్యాన్ మేడ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

 

మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ చేయబోతున్నానని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచర్ స్టోరీ రాస్తున్నట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహలో ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహేశ్ బాబు అభిమానులు ఓ స్పెషల్ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఆట మొదలైంది.. వేట కొనసాగుతుంది అంటూ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.

ఇందులో మహేష్ బాబు గుర్రం మీద కూర్చొని, ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరిన సాహస యాత్రికుడిగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, నెత్తిన క్యాప్, వెనక బ్యాగ్ తగిలించుకుని స్టైలిష్ గా ఉన్నాడు. ఏఐతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా లేదని, అఫీషియల్ ఫస్ట్ లుక్ మాదిరిగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో దాదాపు మహేష్ ఇదే లుక్ లో కనిపించే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారనే సంగతి తెలిసిందే. తన కెరీర్ లోనే మునుపెన్నడూ చూడని బెస్ట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆఫ్ లైన్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏ పిక్ బయటకి వచ్చినా క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వైరల్ చేస్తున్నారు. హాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని పోస్టులు పెడుతున్నారు.

SSMB 29 సినిమా షూటింగ్ 2025 జనవరిలో ప్రారంభం అవుతుందని ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. సాధారణంగా తనకు ఒక కథ రాయడానికి రెండు మూడు వారాలు పడితే, మహేష్ బాబు కోసం స్టోరీ రాయడానికి రెండేళ్లు పట్టిందని చెప్పారు. అయితే ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తారనే ఓ రూమర్ కూడా వినిపిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా భాగం కానున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి 'గరుడ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News