2000 కోట్ల స్కామ్ నుంచి తప్పించుకునేందుకే!?
ప్రయాగ్రాజ్లో 2025 మహా కుంభమేళాకు భారీ ఎత్తున భక్తులు, ప్రజలు తరలి వెళుతున్న సంగతి తెలిసిందే.;
ప్రయాగ్రాజ్లో 2025 మహా కుంభమేళాకు భారీ ఎత్తున భక్తులు, ప్రజలు తరలి వెళుతున్న సంగతి తెలిసిందే. దేశవిదేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు తరలి రావడమే గాక, ఇక్కడ పూజా పునస్కారాలు ఆచారాలతో తరిస్తున్నారు. ఈసారి కుంభమేళాకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా వెళ్లారు. అన్ని సినీపరిశ్రమల నుంచి ప్రముఖులు కుంభమేళాకు ఆధ్యాత్మిక చింతనతో విచ్చేసారు.
అయితే కుంభమేళాలో అనూహ్యంగా వెటరన్ హీరోయిన్ మమతా కులకర్ణి కిన్నార్ అఖారా మహామండలేశ్వర్గా మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాషాయం ధరించిన మమతా పై యోగా గురువు బాబా రాందేవ్ సహా పలువురు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. సరైన ఆధ్యాత్మిక అర్హత లేకుండా ఎవరికీ మహామండలేశ్వర్ అనే బిరుదు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాబా రాందేవ్ తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ ఒకరి పేరు ముందు `బాబా` అని జోడించడం వల్ల బయటికి మోసపూరితంగా కనిపిస్తారని దానిని ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. కుంభ్ నిజమైన సారాంశం ధ్యానం - భక్తి వంటి అభ్యాస ప్రక్రియ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడం అని ఆయన నొక్కి చెప్పారు. నిజమైన కుంభ్ అంటే సత్యం, ప్రేమ, కరుణ ద్వారా ఉన్నత స్థితిని సాధించడం అని ఆయన వివరించారు. శాశ్వతమైన సత్యంపై ఆధారపడిన సనాతన విలువలతో జీవించడం, ప్రోత్సహించడం తాలూకా ప్రాముఖ్యతను బాబా రాందేవ్ ఎత్తి చూపారు. సనాతన సూత్రాలు కాలాతీతమైనవి, వాటి కోసం ప్రామాణికంగా జీవించాలి. సనాతన విలువలను తప్పుగా సూచించలేమని రాందేవ్ నొక్కి చెప్పారు. ఈ విలువలలో అగ్ని, భూమి, సూర్యుడు, చంద్రుడు వంటి అంశాలు ఉన్నాయి. ఒక సాధువు లేదా మహామండలేశ్వరుడిగా ఉండటం అసాధారణమైనదని పేర్కొన్నారు. నిజమైన ఆధ్యాత్మిక సాధన లేకుండా దానిని తేలికగా తీసుకోవలసినది లేదా ఇవ్వవలసినది కాదని బాబా పేర్కొన్నారు. దీంతో ఆయన మమతా కులకర్ణి కొత్త పాత్రను పూర్తిగా సందేహించారని అర్థమవుతోంది.
మమతా కులకర్ణి సాధువుగా మారడం వివాదాస్పదంగా మారడంతో అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్రివేణిలో స్నానం చేసిన తర్వాత పిండ దానం వంటి ఆచారాలలో మమతా కులకర్ణి పాల్గొనడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే బాబా రాందేవ్ మహామండలేశ్వర్గా నియామకాన్ని విమర్శిస్తూనే ఉన్నారు.
పీఠాధీశ్వర్ పండిట్ ధీరేంద్ర శాస్త్రి .. మహా కుంభ్ సమయంలో కిన్నార్ అఖారాకు మహామండలేశ్వర్గా నటి మమతా కులకర్ణికి అర్హత కల్పించడాన్ని ప్రశ్నించారు. తన పూర్వ జీవితాన్ని త్యజించిన కులకర్ణి, దైవిక మార్గంలో తన సన్యాసాన్ని సమర్థించుకుంది. సాధువుల నుండి ఆశీర్వాదాలను పొందింది.ఆదివారం పవిత్ర స్నానం చేస్తూ శాస్త్రి ఈ నిర్ణయం విశ్వసనీయతను ప్రశ్నించాడు. నిజమైన సాధు స్ఫూర్తి ఉన్నవారికి మాత్రమే అలాంటి బిరుదులు ఇవ్వాలని సూచించాడు. బయటి వేషం చూసి ఒకరిని సాధువుగా లేదా మహామండలేశ్వర్గా ఎలా చేయగలరు? అని ప్రశ్నించారు. మేము ఇప్పటివరకు మహామండలేశ్వర్గా మారలేకపోయాము అని ఆయన అన్నారు.
ఇటీవల ట్రాన్స్ జెండర్ కథావచక్ జగత్గురు హిమాంగి సఖిమా కూడా మమతా కులకర్ణి నియామకాన్ని విమర్శించారు. మాదకద్రవ్యాల కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉండటంతో సహా కులకర్ణి వివాదాస్పద గతాన్ని ఉటంకిస్తూ ఇలా కొత్త డ్రామాలాడుతోందని విమర్శించారు. 2000 కోట్ల డ్రగ్స్ స్కామ్ లో పాత్రధారిగా ఉండడం వల్ల దాని నుంచి తప్పించుకునేందుకు ఇలా సన్యాసిని అవతారం ఎత్తిందని విమర్శిస్తున్నారు కొందరు నెటిజనులు.