'మైత్రీ' పాన్ ఇండియా ప్లాన్స్!

వీటిల్లో అన్నటికంటే ముందుగా 'పుష్ప 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ మేకర్స్ పూర్తిగా నిర్మాణాలపైనే దృష్టి పెట్టనున్నారు.

Update: 2024-07-01 16:46 GMT

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో 'మైత్రీ మూవీ మేకర్స్' ఒకటి. ఓవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు మీడియం రేంజ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలని అందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు నవీన్ యెర్నేని & యలమంచిలి రవి శంకర్. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో కూడా సినిమాలు తీస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వీళ్ళ బ్యానర్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి. వాటిల్లో కొన్ని సెట్స్ మీద ఉండగా, మరికొన్ని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. ఇది భారీ బడ్జెట్ తో తీస్తున్న పాన్ ఇండియా సినిమా. దీనిపై అందరిలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అన్నీ ప్లాన్ చేసుకున్నట్లు జరగకపోవడంతో డిసెంబర్ కు వాయిదా వేశారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండటంతో, మేకర్స్ ఇప్పుడు ఇతర భారీ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన చిత్రాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more!

రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ నిర్మాతలు 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నాయి. మార్చిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసిన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. అన్నీ పగడ్బంధీగా ప్లాన్ చేసుకున్నారు. కానీ శంకర్ తో చెర్రీ చేస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా లేట్ అవుతుండటంతో, బుచ్చిబాబు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. అయితే ఇటీవలే చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవడంతో, తన 16వ చిత్రాన్ని మొదలుపెట్టాలని చూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'NTR31' అనే పేరుతో చాన్నాళ్ల క్రితమే మైత్రీ టీం ఓ భారీ చిత్రాన్ని ప్రకటించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ ను కూడా దీంట్లో భాగం చేసారు. ప్రతీ ఏడాది తారక్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ వదులుతున్నారు కానీ, ఇంతవరకూ ఈ సినిమా ప్రారంభం కాలేదు. 'దేవర' పార్ట్-1 లో ఆయన వర్క్ చివరి దశకు చేరుకోవడంతో.. ఎట్టకేలకు ఇప్పుడు నీల్ ప్రాజెక్ట్ మీదకు రావాలని చూస్తున్నారు. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ ఈ మధ్యనే వెల్లడించారు.

ఇక ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి మైత్రీ నిర్మాతలు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. ఫైనల్ గా 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీ సెట్ చేసారు. ఈ చిత్రాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. 'కల్కి'తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన డార్లింగ్.. 'రాజా సాబ్'తో పాటుగా హను సినిమాని కూడా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారట. ఇది సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా మైత్రీ మేకర్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించబోతున్న మూడు పాన్ ఇండియా చిత్రాలు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో షూట్ కు వెళ్ళబోతున్నాయి. ఇటీవలే బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ తో చేస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కోసం రెడీ చేస్తున్నారు. అలానే నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమాని నిర్మిస్తున్నారు. ఇది డిసెంబర్ లో రానుంది. మధ్యలో '8 వసంతాలు' అనే చిన్న సినిమా కూడా ఉంది.

ఇక విజయ్‌ దేవరకొండ, ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబోలో అనౌన్స్ చేసిన 'VD 14' ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సీమ యాసలో మాట్లాడే నటీనటులను ఎంపిక చేయడానికి చిత్ర బృందం ఈ రోజు నుంచి కర్నూలులో టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. గౌతమ్ తిన్ననూరి, రవికుమార్ కోలా సినిమాలతో పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగే అవకాశం ఉంది. ఇలా మైత్రీ బ్యానర్ నుంచి రాబోయే రెండేళ్లలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. వీటిల్లో అన్నటికంటే ముందుగా 'పుష్ప 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ మేకర్స్ పూర్తిగా నిర్మాణాలపైనే దృష్టి పెట్టనున్నారు.

Tags:    

Similar News