కుటుంబం కోసం సింహంలా పోరాడుతా! నాగార్జున
నాగ చైతన్య-సమంత విడాకులను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే.
నాగ చైతన్య-సమంత విడాకులను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. ఇప్పటికే నాగార్జున చట్టపరమైన చర్యలకు దిగారు. నాంపల్లి కోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు రానుంది. కేటీఆర్ కూడా లీగల్ నోటీసులిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మరోసారి సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.
`కొండా సురేఖపై మరో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసే పనిలో ఉన్నాం. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబాన్ని ఎంతగానో బాధించాయి. ఇప్పుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. కానీ సురేఖ క్షమాపణలు చెప్పింది సమంతకు. మాకు టుంబానికి కాదు. నాకు కాదు` అన్నారు. మరి ఒకవేళ మీకు, మీకుటుంబానికి క్షమాపణలు చెబితే కేసు వాపస్ తీసుకుంటారా? అంటే?
`కుదరదు. నా కుటుంబానికి క్షమాపణ చెప్పినా కేసును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు. ఆ అవకాశమేలేదు. ఇది వ్యక్తిగత విషయం కాదు. నన్ను, నా కుటుంబాన్ని దాటిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని చిన్నా పెద్దా అంతా మాకు మద్దతుగా నిలిచారు. మన వ్యవస్థకు సోకిన తెగులును అరికట్టే ప్రక్రియలో మేమున్నామని నేను భావిస్తున్నా. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను వాడుకోవడం సరికాదు.
మేం చిత్రపరిశ్రమకు చెందినంత మాత్రాన మాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మెతకగా ఉండబోము. ఈ విషయంలో మంత్రి సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాజకీయ నాయకులు మమ్మల్ని దూషించేందుకు ఒక గట్టి హెచ్చరిక అవుతుందని నేను ఆశిస్తున్నా. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సింహంలా పోరాటం చేస్తా. చట్టపరంగా ఆలస్యమవుతుందని తెలుసు. ఎంత కాలమైనా పోరాటం కొనసాగిస్తా. వీలైనంత త్వరంగా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా` అన్నారు.