మరో కొన్ని గంటల్లో సుశాంత్ మరణంపై బాంబే కోర్టులో ఏం తేలనుంది?
ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ సాగుతున్నా కానీ సుశాంత్ సింగ్ తండ్రి కెకె సింగ్ తనయుడి ఆత్మహత్యను నిర్ధారించడం లేదు.
బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఏళ్ల తరబడి దర్యాప్తు సాగుతున్న సంగతి తెలిసిందే. పోలీసులతో పాటు, సీబీఐ-ఈడీ సహా పలు ఏజెన్సీలు దర్యాప్తు చేసినా అసలు నిజాలు ఇంకా బయటపడలేదు. ఇది ఇంకా అనుమానాస్పద మరణంగానే సుశాంత్ సింగ్ కుటుంబీకులు, అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ సాగుతున్నా కానీ సుశాంత్ సింగ్ తండ్రి కెకె సింగ్ తనయుడి ఆత్మహత్యను నిర్ధారించడం లేదు.
ఇది కచ్ఛితంగా ఇతరుల ప్రమేయం ఉన్న హత్య అని అతడు వాదిస్తున్నారు. తాజాగా సుశాంత్ సింగ్, అతడి మేనేజర్ దిశా సాలియన్ మరణాలపై దర్యాప్తు చేయడానికి ఉద్దేశించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)ను ఫిబ్రవరి 19న బాంబే హైకోర్టు విచారించనుండగా సింగ్ బలమైన వాదన అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఈ రెండు అనుమానాస్పద మరణాలకు సంబంధించి శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య థాకరేను అరెస్టు చేసి ప్రశ్నించాలని కోర్టులో వేసిన పిల్ డిమాండ్ చేస్తోంది.
తనయుడి మరణం వెనక మిస్టరీని ఛేధించి, న్యాయం జరిగేలా కొత్త మహారాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవం ఏమిటన్నది కోర్టులో బయటపడుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి మాకు అండగా నిలుస్తారని కెకె సింగ్ అంటున్నారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత అల్ప మనస్కుడు కాదని, చిన్న వయసులోనే కొడుకును కోల్పోయిన బాధ తమను వీడలేదని ఆయన ఆవేదన చెందారు.
కోర్టులోనే అసలు నిజం తేలాలి. ఇది హత్యా? లేక ఆత్మహత్యనా? అన్నది కోర్టు తేల్చాల్సి ఉంటుంది. 34 ఏళ్ల సుశాంత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్టు కనిపించాడు. కానీ ఇది ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. సీబీఐ విచారణలో నిజానిజాలు ఏమిటన్నది రేపటి కోర్టు విచారణలో తేలాల్సి ఉంది. ఈ బుధవారం నాడు బాంబే హైకోర్టు విచారణలో ఏం తేల్తుందో చూడాలన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది.