ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొన్న 4 పడవలు.. కుట్ర ఏమైనా ఉందా?

ఈ ఘటన వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న ప్రశ్న వ్యక్తమవుతూనే ఉంది.

Update: 2024-09-07 04:41 GMT

విజయవాడ నగరాన్ని చుట్టుముట్టిన వరదల నేపథ్యంలో లక్షలాది మంది ఎంతలా అతలాకుతలం అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరద విరుచుకుపడి దాదాపు వారానికి పైగా అవుతున్నా.. ఇప్పటికి పరిస్థితులు ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వరద తీవ్రత ఎక్కువగా ఉండి.. విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న వేళ.. అనూహ్యంగా నాలుగు మర పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన వైనంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

ఈ ఘటన వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న ప్రశ్న వ్యక్తమవుతూనే ఉంది. దీనికి తోడు నాలుగు మర పడవలు.. నేరుగా ప్రకాశం బ్యారేజీలోని గేట్లను ఢీ కొట్టటం. .అది కూడా కీలక ప్రాంతంలో ఢీ కొట్టిన వైనం చూసినప్పుడు.. బ్యారేజీ ధ్వంసం చేయటానికి ప్లాన్ చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వీటిపై తాజాగా ఇరిగేషన్ అధికారులు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు మరపడవలు ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టటం వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్నది తేల్చాలని కోరారు. ప్రకాశంబ్యారేజీని ఢీ కొట్టిన నాలుగు మరపడవల్లో మూడు పెద్దవి కాగా.. ఒకటి చిన్నది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఒకేసారి నాలుగు పడవలు రావటంతో పలు సందేహాలు నెలకొన్నాయి. ఈ ఉదంతంపై పోలీసుల నివేదిక ఏం చెబుతుందో చూడాలి.

Tags:    

Similar News