లద్దాఖ్ లో 5 జిల్లాలు.. కశ్మీర్ లో అభ్యర్థులు.. బీజేపీ చకచకా ఎత్తులు

ఇలాంటి పరిస్థితుల్లోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది.

Update: 2024-08-26 07:29 GMT

సరిగ్గా ఐదేళ్లు అయింది ఆర్టికిల్ 370 రద్దు చేసి.. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికిల్ ను మోదీ ప్రభుత్వం రెండో విడతలో రద్దు చేసింది. ఉమ్మడి జమ్ము-కశ్మీర్ ను కశ్మీర్-లద్దాఖ్ అనే రెండు వేర్వేరు ప్రాంతాలుగా విభజించి.. కేంద్ర ప్రభుత్వ పాలన విధించింది. ఆర్టికిల్ 370 రద్దుపై మొన్నటివరకు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. అయితే, సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వం చర్యను సమర్థించింది. కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని కూడా స్పష్టం చేసింది. ఇక కశ్మీర్, లద్దాఖ్ విషయానికి వస్తే.. రెండు భిన్న ప్రాంతాలు. లద్దాఖ్ లో హిందువులు, బౌద్ధులు అధికం. కశ్మీర్ లో ముస్లింలు ఎక్కువ. దీంతోపాటు ఉగ్రవాదం కూడా ఇటీవల మళ్లీ జడలు విప్పుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది.

లద్దాఖ్ ను జిల్లాలుగా చేసి

వైశాల్యం పరంగా పెద్దదైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లో ప్రస్తుతం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అవి మనందరికీ తెలిసిన లేహ్, కార్గిల్ ప్రాంతాలు. అయితే, కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జన్ స్కర్, డ్రాస్, శామ్, సుబ్రా, చంగ్ థంగ్ జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. కశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో లద్దాఖ్ లో జిల్లాల విభజన ప్రాధాన్యం సంతరించుకుంది.

లద్దాఖ్ కు ఎన్నికలు ఎప్పుడు?

పాక్ సరిహద్దున ఉండే జమ్మ కశ్మీర్ కు ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక్కడ 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి అక్టోబరు 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల వ్యవధి కూడా లేనందున బీజేపీ తొలి విడత జాబితాను ప్రకటించి.. మళ్లీ మార్పు చేర్పుల కోసం వెనక్కుతీసుకుంది. మరోవైపు లద్దాఖ్ కు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు అనేది తేల్చాల్సి ఉంది. అయితే, విభజన సమయానికి లద్దాఖ్ కు అసెంబ్లీ లేదు. కశ్మీర్ కు ఉంది. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుకు వీలుగా జిల్లాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News