ఈ వీడియో చూస్తే.. ఆనంద్ మహీంద్రా మాటల్లో అర్థం తెలుస్తుంది

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ ప్రీక్యార్టర్స్ కు దూసుకెళ్లారు.

Update: 2024-08-01 06:41 GMT

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆసక్తికర అంశాల్లో అత్యుత్తమంగా అనిపించే వాటిని ఎంపిక చేసుకొని మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అంతేనా.. అంతకు మించి అన్నట్లు తన వ్యాఖ్యను జోడిస్తారు. దీంతో.. అద్భుతమైన ఐస్ క్రీం మీద అదిరే టాపింగ్ మాదిరి ఆయన వ్యాఖ్యానం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ ప్రీక్యార్టర్స్ కు దూసుకెళ్లారు.

ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నంబర్ 4 ర్యాంకర్ జొనాథన్ క్రిస్టిపై 21-18, 21-12 తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అతడి ఆటలో భాగంగా బ్యాక్ షాట్ తో అతను కొట్టిన షాట్ లక్ష్యసేన్ నెట్టింట వైరల్ గా మారింది. అతగాడి ఆటపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. లక్ష్యసేన్ ఆటపై ఆయన చేసిన సరదా వ్యాఖ్య అందరిని ఆకట్టుకుంటోంది.

‘‘నేనే కనుక అతడి ప్రత్యర్థిని అయి ఉంటే.. లక్ష్యసేన్ కొట్టిన షాట్ తప్పని వాదించేవాడ్ని. అంతేకాదు.. అతడిపై కేసు వేసేవాడిని. మూడు చేతులున్న ప్రత్యర్థిని ఎదుర్కొన్నానని ఆరోపణలు చేసేవాడిని’’ అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన లక్ష్యసేన్.. తాను ఎదుర్కొన్న కఠిన ప్రత్యర్థుల్లో జొనాథన్ ఒకరుగా చెప్పారు.

అత్యంత క్లిష్టమైన మ్యాచ్ గా పేర్కొన్న అతను.. తన మొదటి ప్రాధాన్యం బంగారు పతకమేనని చెబుతున్నాడు. కొన్ని నెలలుగా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నానని.. ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడటం వల్ల ఫామ్ అందిపుచ్చుకున్నట్లు చెప్పాడు. అతని కల నెరవేరాలని.. లక్ష్యానికి చేరుకొని పసిడి మెరుపులతో త్రివర్ణ పతాకాన్నిసగర్వంగా ఎగిరేలా చేయాలని ఆశిద్దాం. ఆ క్షణాల కోసం వెయిట్ చేద్దాం.

Tags:    

Similar News