వైరల్‌.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్తా కోడలు!

అంతేకాకుండా సాధారణ వివాహాల మాదిరిగానే అంగరంగ వైభవంగా బంధుమిత్రులను పిలిచి వేడుకలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-08-13 06:53 GMT

మహిళలు మహిళలను పెళ్లాడటం (లెస్బియన్స్‌), పురుషులు పురుషులను వివాహం చేసుకోవడం (గే మ్యారేజెస్‌) వంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. కొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహాలకు అంగీకారం తెలుపుతున్నారు. అంతేకాకుండా సాధారణ వివాహాల మాదిరిగానే అంగరంగ వైభవంగా బంధుమిత్రులను పిలిచి వేడుకలు నిర్వహిస్తున్నారు.

తాజాగా బిహార్‌ లోని గోపాల్‌ గంజ్‌ జిల్లాలో బెల్వా గ్రామంలోనూ ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఒక అత్త తన మేనకోడలిపై మనసు పారేసుకుంది. ఇందుకోసం తన భర్తను సైతం విడిచిపెట్టేసింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న అత్తాకోడలు జంట ఇంటిలో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.

అత్తాకోడలు పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. తాను తన అత్తను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానని.. మేనకోడలు వెల్లడించడం విశేషం. ఈ పెళ్లిలో మేనకోడలు పెళ్లి కుమార్తెలాగా అలంకరణలో ఉండగా, అత్త పురుషుడిలా ప్యాంటు, షర్టు ధరించడం విశేషం.

తన బంధువుల సమక్షంలో దుర్గా భవాని ఆలయంలో అత్త తన మేనకోడలితో అగ్నిసాక్షిగా ఒక్కటైంది. కోడలి మెడలో అత్త మంగళ సూత్రం కట్టడం విశేషం. అగ్ని ప్రదక్షిణ చేసి ఈ జంట ఒకరితో ఒకరు కలిసి నడుస్తామని ప్రమాణం చేశారు.

తానంటే తన మేనకోడలికి ఎంతో ఇష్టమని.. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతోనే మేన కోడలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చిందని అత్త తెలిపింది. దీంతో తామిద్దరం బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యామని వెల్లడించింది. ఈ అత్తాకోడలి పెళ్లి స్థానికంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News