4 నెలల వయసులో వివాహం.. 21 ఏళ్లకు రద్దు.. ఏం జరిగింది?

ఇందులో భాగంగా... బాల్యవివాహం దుర్మార్గమే కాదు నేరం కూడా అని అన్నారు.

Update: 2024-10-01 06:32 GMT

బాల్య వివాహం అనే దారుణం చాలా చోట్ల కనుమరుగైనప్పటికీ.. అది మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అక్కడక్కడా ఇంకా దర్శనమిస్తుంటాయి! ఆ సంగతి అలా ఉంటే... సుమారు నాలుగు నెలల వయసులో బాల్య వివాహాల సంకెళ్ల బారిన పడిన ఓ చిన్నారి.. దాదాపు 20 ఏళ్ల పాటు ఆ బాధను అనుభవించింది.. తాజాగా దాని నుంచి విముక్తి పొందింది.

అవును... 4 నెలల వయసులో బాల్య వివాహానికి బలై, ఆ బాధను 20 ఏళ్లపాటు భరించిన ఓ యువతి తాజాగా ఆ బాల్య వివాహం నుంచి విముక్తి పొందింది. సారధి ట్రస్ట్, పునరావాస మనస్తత్వవెత్త మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృతి భారతి కృషి కారణంగా ఇది విజయవంతమైంది. 21 ఏళ్ల యువతి బాల్య వివాహాన్ని కోర్టు రద్దు చేసింది.

ఈ వివాహంపై విచారణ చేపట్టిన జోధ్ పూర్ లోని ఫ్యామిలీ కోర్టు నెంబర్ 2 న్యాయమూర్తి వరుణ్ తల్వార్.. ఈ మేరకు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఇదే సమయంలో.. కోర్టు ఖర్చులను భర్త అని పిలవబడే ఆ వ్యక్తి బాల వధువుకు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది! ఈ సందర్భంగా జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... బాల్యవివాహం దుర్మార్గమే కాదు నేరం కూడా అని అన్నారు. వీటివల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందని తెలిపారు. ఈ విషయంలో అమ్మాయి లేదా అబ్బాయి.. తమ బాల్య వివాహాన్ని కొనసాగించకూడదని అనుకుంటే ఆ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు వారికి ఉంటుందని తెలిపారు.

కాగా... దేశంలోనే తొలి బాల్య వివాహాన్ని రద్దు చేసిన తర్వాత డాక్టర్ కృతి భారతి.. ఈ విషయంపై నిరంతర ప్రచారాన్ని నిర్వహిస్తూ ఇప్పటివరకూ 52 జంటలకు బాల్య వివాహాలు రద్దు చేసి రికార్డ్ సృష్టించారు. ఈ సమయంలో... డాక్టర్ కృతి పేరు 9 జాతీయ, అంతర్జాతీయ రికార్డు పుస్తకాలలో నమోదైంది.

Tags:    

Similar News