టీచర్ లకు లోకేష్ గుడ్ న్యూస్... ఇకపై టాయిలెట్స్ వద్ద ఆ పని లేదు!

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రధానంగా గవర్నమెంట్ టీచర్స్ విషయంలో గత ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందనే విషయం తెలిసిందే

Update: 2024-08-06 10:21 GMT

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రధానంగా గవర్నమెంట్ టీచర్స్ విషయంలో గత ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందనే విషయం తెలిసిందే! ఈ విషయాని మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నాటి ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పుకుంటారని అంటుంటారు. ఫలితంగా.. నేడు వైసీపీ ఈ స్థాయిలో పరాజయం పాలైందని చెబుతుంటారు. ఈ సమయంలో లోకేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించడంతో పాటు ఇతర పనులు కూడా ఉండేవి! అందులో ప్రధానంగా... ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాల పర్యవేక్షణలో భాగంగా స్కూల్స్ లోని వాష్ రూమ్ ల ఫోటోలను తీసి ఇంటిగ్రేటెడ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అప్ లోడ్ చేయాల్సి ఉండేది. అయితే... ఇకపై ఆ పని చేయాల్సిన అవసరం లేదని లోకేష్ చెప్పారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి నారా లోకేష్... ఇకపై ఉదయానే పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని తెలిపారు. ఈ విధానాన్ని ఆపేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో... ఆ ఆప్షన్ ను సదరు యాప్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు. అదేవిధంగా... టీచర్ల సమస్యలన్నింటినీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని అన్నారు!

ఈ సందర్భంగా స్పందించిన లోకేష్... "ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్ లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్ధండి. టీచర్ల సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం" అని ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో... తమ సమస్యను వెంటనే పరిష్కరించారంటూ ఉపాధ్యాయులు లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలో మిగిలిన సమస్యలూ పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News