రెడ్లు తెగబడి ఓడించారా వైసీపీని ?

అలాంటి రెడ్లు ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ తమ రాజకీయ పలుకుబడిని ఎక్కడా కోల్పోలేదు అన్నది వాస్తవం

Update: 2024-06-27 23:30 GMT

రెడ్లు అంటే రాజకీయంగా ఎంతో ప్రభావవంతమైన వర్గాలు. వారు ఆధునిక ప్రజాస్వామిక యుగంలో కాకుండా అంతకు ముందు నుంచి కూడా ఆధిపత్య శక్తులుగా ఉన్నారు. రాజ్యాలు ఏలారు. వారు తలచుకుంటే ఎవరిని అయినా అందలం ఎక్కించగలరు, అలాగే దించగలరు. అలాంటి రెడ్లు ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ తమ రాజకీయ పలుకుబడిని ఎక్కడా కోల్పోలేదు అన్నది వాస్తవం

ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తోనే అల్లుకుని పవర్ ఫుల్ పాలిటిక్స్ చేసిన రెడ్లు, విభజన ఏపీలో వైసీపీని అనుసరించారు. ఆ పార్టీ ద్వారా తమ రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని భావించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి కోరికలు ఏవీ తీరకపోతే తీరని ఆశాభంగం ఎదురైంది అని అంటున్నారు. వైసీపీకి బ్యాక్ బోన్ గా ఉండే రెడ్లు తాజా ఎన్నికల్లో ఫస్ట్ టైం వైసీపీ మీద రెడ్ సిగ్నల్ చూపించారు అని అంటున్నారు.

తమ బలంతో తన స్వేదంతో అధికారంలోకి వచ్చిన జగన్ తమను లైట్ తీసుకోవడం సహించలేకపోయిన రెడ్లు భారీగానే వైసీపీకి దెబ్బ కొట్టారు. ఆ ఫలితమే 11 సీట్లకు వైసీపీని పడదోసి పాతాళం అంచులను చూపించింది అని అంటున్నారు. రాయలసీమలోన్ నాలుగు జిల్లాలలో రెడ్ల ప్రాబల్యం గణనీయంగా ఉంటుంది. 2011లో వైసీపీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కొమ్ము కాస్తూ అనేక ఎన్నికల్లో ఆ పార్టీ వెంట నిలిచిన రెడ్లు 2024లో మాత్రం కాడె వదిలేశారు.

దాంతో మొత్తం నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి దక్కినవి సోది లోకి కూడా కాకుండా పోయాయి. అదే విధంగా నెల్లూరు అంటే పెద్దా రెడ్లకు కేరాఫ్ అని చెబుతారు. అలాంటి చోట వైసీపీ 2014లో మెజారిటీ సీట్లు సాధించింది. 2019లో ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది. 2024లో చూస్తే మొత్తానికి మొత్తం సీట్లను టీడీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక్కడ పదికి పది సీట్లలో రెడ్ల ప్రాబల్యం గణనీయంగా ఉందన్న సంగతి మరవరాదు అంటున్నారు.

Read more!

ఇక ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మొత్తం 12 అసెంబ్లీ సీట్లలో ఎనిమిది నియోజకవర్గాలలో రెడ్ల ప్రాబల్యం ఉంది అని అంటున్నారు. ఇక పల్నాడులో రెడ్ల ప్రాబల్యం నాలుగు జిల్లాలలో గణనీయంగా ఉంది. అదే విధంగా చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాలలో రెడ్లు శాసిస్తూ ఉంటారు. అలాగే విశాఖలో చూస్తే గాజువాక సీటులో రెడ్ల ప్రాబల్యం ఉంది.

మొత్తంగా చూసుకుంటే రాయలసీమ 52 ప్లస్ నెల్లూరు 10 ప్లస్ ప్రకాశం 8 ప్లస్, పల్నాడులో 4 ప్లస్ ఈస్ట్ గోదావరి 2 ప్లస్ విశాఖ 1 కలులుకుంటే మొత్తం 77 అసెంబ్లీ నియోజకవర్గాలలో రెడ్లు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు.

రాయలసీమలో చూసుకుంటే ఎస్సీ రిజర్వుడు సీట్లలో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మునిసిపల్ చైర్మన్లు ఇలా లోకల్ బాడీస్ లో రెడ్లే అధిక శాతం పదవులలో ఉంటారు. ఇంతలా గ్రౌండ్ లెవెల్ వరకూ అధికారాన్ని పంచుకుని సామాజిక వర్గాల పరంగా ప్రభావం చూపిస్తూ అన్నింటా తామే అయిన రెడ్లు ఎందుకు వైసీపీకి ఓటేయించి గెలిపించలేకపోయారు అన్న చర్చ సాగుతోంది.

అయితే గత అయిదేళ్లలో వైసీపీ పాలనలో వారు పూర్తిగా అసంతృప్తికి లోను అయ్యారని అంటున్నారు. అది దావానలంగా మారి పెరిగి ఎన్నికల వేళకు చిచ్చు పెట్టింది అని అంటున్నారు. లోకల్ బాడీస్ లో రెడ్లు గెలిచి రాజకీయ అధికారం సంపాదించినా ఖర్చు పెట్టేందుకు పైసా కూడా నిధులు లేవని అంటున్నారు.

4

వైసీపీ ఏలుబడిలో సర్పంచుల పరిస్థితి ఎంతలా దిగజారింది అంటే వారికి చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. వారు బిల్స్ అడుగుతారేమో అని ఇలా చేశారు అంటున్నారు. దీంతోనే వారికి మండిందని అంటున్నారు. ఇక చూస్తే గతసారి వైసీపీ గెలిచిన 151 ఎమ్మెల్యేలలో రెడ్లు 50కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉన్నారు. ఈ నిష్పత్తిలో వారికి కేబినెట్ కూర్పులో కచ్చితంగా ఎనిమిది నుంచి పది పోస్టులు దాకా రావాలి.

కానీ సామాజిక న్యాయం అని చెప్పి వారిని పక్కన పెట్టేశారు. జస్ట్ మూడు నాలుగు పోస్టులకే పరిమితం చేశారు. దీనితో వారికి కాలిపోయింది అని అంటున్నారు. అలాగే వారికి నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం చేశారు అని అంటున్నారు. ఇక కాంట్రాక్టులు ఏమైనా చేసుకోవాలనుకున్నా సర్కార్ నుంచి డబ్బులు విదిలించే పరిస్థితి లేదు. ఇలా రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా దెబ్బ తిన్న రెడ్లు తెగబడి మరీ వైసీపీని కసిగా ఓడించారు అని అంటున్నారు.

Tags:    

Similar News