జగన్ లండన్ టూర్ పై షర్మిల షాకింగ్ కామెంట్లు!

ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ లండన్ టూర్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-24 17:03 GMT

ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో పల్నాడు జిల్లాతో పాటు తాడిపత్రి, పలు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఇటువంటి సమయంలో జగన్ లండన్ లో పర్యటించడం ఏమిటని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ లండన్ టూర్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏలూరులో 10వ తరగతి బాలికపై అత్యాచారం జరిగిన ఘటన నేపథ్యంలో జగన్ పై షర్మిల విరుచుకుపడ్డారు. లండన్ వీధుల్లో పొర్లదండాల మధ్య విహరిస్తున్న మీకు ఏపీలో ఆడపిల్లల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు అంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. నా అక్కలు, చెల్లెమ్మలు, తల్లులు, అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకునే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని ఎద్దేవా చేశారు. మహిళల ముందు మొసలి కన్నీరు కార్చి ప్రేమ నటించే సీఎం ఈ అత్యాచారాల గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు.

ఏపీలో మహిళలకు భద్రత, మహిళల బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, కానీ, ఎందులో అగ్రస్థానం రావాలో అందులో రావడం లేదని చురకలంటించారు. మీరు, మీ మహిళా మంత్రులు సిగ్గుతో తలదించుకుంటారో, సిగ్గులేకుండా ఉంటారో ప్రజలు గమనిస్తున్నారని షర్మిల సంచలన విమర్శలు గుప్పించారు.


Full View


Tags:    

Similar News