లవ్ చేసుకొని పెళ్లాడిన గంటల్లోనే గొడవ.. ఇద్దరు చనిపోయారు

షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవ పడ్డారు.

Update: 2024-08-09 04:29 GMT

షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవ పడ్డారు. తీవ్ర గాయాలతో ఇద్దరు మరణించిన ఉదంతం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్న గంటల్లోనే ఎలా చనిపోయారు? ఎంత గొడవ అయితే మాత్రం.. చంపుకునేంత పరిస్థితి ఎందుకు దాపురించింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. కర్ణాటకలో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని చంబరసనహళ్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల నవీన్.. 22 ఏళ్ల లిఖితలు ఇద్దరు ప్రేమించుకున్నారు. అతను వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. అతను.. లిఖిత ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దల అనుమతించారు. దీంతో రెండు రోజుల క్రితం (ఆగస్టు 7న) పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహాం స్థానిక కల్యాణ మండపంలో జరిగింది. పెళ్లి టైంలోనూ.. పెళ్లి తర్వాత తమ బంధువులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. పెళ్లైన సాయంత్రం కొత్త దంపతులు నవీన్ అక్క ఇంటికి వెళ్లారు.

లిఖితను.. ఆమె తల్లిదండ్రుల్ని తన అక్క ఇంటికి తీసుకెళ్లాడు నవీన్.

ఇరువురు ఆ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు గదిలోకి వెళ్లారు. అలా వెళ్లిన కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా కాసేపటికే పెద్దదైంది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన నవీన్.. కత్తితో దాడికి పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున లిఖిత అరుపులు విన్న కుటుంబీకులు కంగారుతో గదిలోకి వచ్చి చూడగా.. కత్తిపోట్లతో రక్తపు మడుగులో చనిపోయి పడి ఉంది. నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై ఉన్నాడు.

దీంతో.. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ తర్వాతి రోజు (గురువారం) సాయంత్రం మరణించాడు. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్న నవీన్.. లిఖితలు.. పెళ్లైన గంటల వ్యవధిలోనే ఇలా మరణించటం మిస్టరీగా మారింది. గదిలోకి వెళ్లిన తర్వాత ఏమైంది? వారి మధ్య గొడవకు కారణమైంది? ఇద్దరికి గాయాలు ఎందుకు అయ్యాయి? ఇద్దరు ఎలా చనిపోయారు? చనిపోవటానికి ముందు ఏం జరిగింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోవైపు ఈ షాకింగ్ ఉదంతంపై మరో కథనం ప్రచారంలో ఉంది. దీని ప్రకారం నవీన్ మానసిక పరిస్థితి కొద్ది రోజులుగా బాగోలేదని చెబుతున్నారు. అతనికి లిఖిత మీద అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. అక్క ఇంటికి వచ్చిన కాసేపటికి లిఖిత ఎవరితోనో చాట్ చేస్తుందని.. ఆమె సెల్ ఫోన్ చూసిన నవీన్ అగ్రహానికి గురై.. హత్య చేసి.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. అసలేం జరిగిందన్న విషయాన్ని పోలీసుల విచారణలో బయటకు వస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News