ఫోన్ తీసుకున్నాడని కరెంట్ షాక్

‘‘తన మొబైల్ ఫోన్ ను భర్త తీసుకున్నాడని కోపం పెంచుకున్న భార్య భర్తకు కరంట్ షాక్ ఇచ్చింది.

Update: 2024-05-31 11:30 GMT

‘‘తన మొబైల్ ఫోన్ ను భర్త తీసుకున్నాడని కోపం పెంచుకున్న భార్య భర్తకు కరంట్ షాక్ ఇచ్చింది. మొదట భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆ తర్వాత కరంటు షాకులు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన 14 ఏళ్ల కుమారుడి మీద కూడా దాడిచేసింది’’ ఉత్తరప్రదేశ్ లోని మొయిన్ పురిలో జరిగిన ఈ అమానవీయ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌తో ప్ర‌దీప్‌సింగ్‌కు వివాహమైంది.

"నా భార్య తన మొబైల్ ఫోన్‌లో ప్రతిరోజూ ఎవరితోనో మాట్లాడేది. ఈ విష‌య‌మై నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. అలా ఈ విష‌యాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాను. వారి సూచ‌న మేరకు నేను ఆమె వ‌ద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నాను. ఇది ఆమెకు కోపం తెప్పించింది. ఫోన్ ఇచ్చేయాల‌ని మొద‌ట‌ ఆమె న‌న్ను బెదిరించింది. ఈ క్ర‌మంలో నన్ను, నా కొడుకును చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డింది. ఆపై ఆమె నన్ను క్రికెట్ బ్యాట్‌తో పదే పదే కొట్టడం చేసింది. నా కొడుకు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె నాకు కరెంట్ షాక్ ఇచ్చింది. నన్ను రక్షించ‌డానికి య‌త్నించిన కుమారుడిపై కూడా దాడి చేసింది" అని ప్ర‌దీప్‌సింగ్ తెలిపాడు.

భ‌ర్త‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన బేబీ యాదవ్‌పై ఐపీసీ సెక్షన్లు 307, 328, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు. భార్య చిత్రహింసల నుండి తప్పించుకున్న ప్రదీప్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఏది ఏమైనా మొబైల్ ఫోన్లు మద్యతరగతి జీవితాలలో అలజడి రేపుతున్నాయి అన్నది వాస్తవం.

Tags:    

Similar News