ధర సంగతేమో కానీ.. వందే భారత్ స్లీపర్ రైళ్ల ఇంటీరియర్

ఇది సరిపోదన్నట్లుగతంలో మాదిరి రైల్వేలకు ప్రత్యేకంగా బడ్జెట్ అన్నది ప్రవేశ పెట్టకుండా.. వార్షిక బడ్జెట్ లో దీన్ని భాగం చేసేశారు.

Update: 2023-10-14 07:22 GMT

దాదాపు పదేళ్ల క్రితం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రేసులో ఉన్న వేళ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ ఒక ఆసక్తికర చర్చ తరచూ జరుగుతుండేది. మోడీ కానీ దేశ ప్రధాని అయితే.. రైల్వేల రూపురేఖలు మారిపోతాయని.. పేదలకు.. మధ్యతరగతి జీవుల్ని ఖుషే చేసేలా రైళ్ల స్వరూపం మారుస్తారని.. మొత్తంగా రైల్వేల దశ తిరిగిపోతుందన్న వాదనలు వినిపించేవారు. కట్ చేస్తే.. మోడీ దేశ ప్రధాని అయి పదేళ్లు కావొస్తోంది. రైల్వేల విషయంలో ఆయన ప్రభుత్వం చేసిన మార్పులు ఏమిటన్నదంటే.. వందే భారత్ రైళ్లను తీసుకురావటమే ఒక్కటే మేలు జరిగింది. దీనికిగాను కొత్త రైళ్లు లేకపోవటం.. ప్యాసింజర్ రైళ్లకు మంగళం పాడేయటం.. ఇప్పటికే ఉన్న చాలా రైళ్లలో జనరల్ కోచ్ లను భారీగా తగ్గించేయటం లాంటివెన్నో జరిగాయి.

ఇది సరిపోదన్నట్లుగతంలో మాదిరి రైల్వేలకు ప్రత్యేకంగా బడ్జెట్ అన్నది ప్రవేశ పెట్టకుండా.. వార్షిక బడ్జెట్ లో దీన్ని భాగం చేసేశారు. కరోనా పేరుతో పెద్ద వయస్కులతో పాటు మరికొన్ని వర్గాలకు ఇచ్చిన రాయితీలకు మంగళం పాడేయటం ద్వారా వారి మీద భారీగా భారాన్ని మోపారు. ఇన్ని కష్టాలు పెట్టి.. వందే భారత్ పేరుతో తీసుకొచ్చిన రైలు విషయానికి వస్తే.. వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు ఈ రైళ్లలో ఎక్కలేని పరిస్థితి.

ఇప్పుడున్న డే సర్వీసులకు అదనంగా రాత్రిళ్లు ప్రయాణించేందుకు వీలుగా బెర్తు సౌకర్యం ఉన్న వందే భారత్ రైళ్లను వచ్చే ఏడాది మొదటికి తీసుకు రావాలన్న ప్రయత్నంలో మోడీ సర్కారు ఉంది. మిగిలిన కష్టాలు.. ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. వందే భారత్ స్లీపర్ కోచ్ లో ఏర్పాటు చేసిన ఇంటీరియర్ చూస్తే మాత్రం కళ్లు చెదరాల్సిందే. విశాలమైన బెడ్లు.. అప్పర్ బెర్తు కోసం ఎక్కేందుకు ఉండే మెట్ల మార్గం సులువుగా ఉండటంతోపాటు.. లైటింగ్ చూస్తే కళ్లు చెదరాల్సిందే.

భారతీయ రైల్వే చరిత్రలో మరే రైళ్లలో లేని విధంగా వందే భారత్ స్లీపర్ రైళ్లలోని ఫీచర్లు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్ వందే భారత్ స్లీపర్ కోచ్ లను తయారు చేస్తోంది. ఏమైనా.. రైల్వే ప్రయాణంలో ఫీల్ విషయంలో సరికొత్త రేంజ్ కు తీసుకెళ్లేలా ఉన్న వందే భారత్ స్లీపర్ రైళ్ల టికెట్ల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తాయంటున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు కాస్తంత కరుణ చూపితే దేశ ప్రజలకు మేలు చేసిన వాళ్లు అవుతారు. మోడీ మాష్టారు మరేం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News