వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ పెద్దాయన సీరియస్ వార్నింగ్

Update: 2021-03-22 03:13 GMT
రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయని.. టీకాలు వేయించుకోవాలన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 43, 846 కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం కేసులు 1.15కోట్లుగా తేలింది. యాక్టివ్ కేసులు 2.66 శాతానికి పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికప్పుడు 3.09లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తేలింది. మొన్నటివరకు కేసులు పెద్దగా లేని వైనం తెలిసిందే. అలాంటిది రోజుల వ్యవధిలో ఇంత భారీగా కేసులు నమోదు కావటం వెనుక కారణమేమిటన్న విషయంపై కారణాల్ని వెతుకుతున్నారు.

ఇలాంటివేళ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించకపోతే దేశాన్ని సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడుకోలేరని చెప్పారు. వీలైంత త్వరగా అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. తాజాగా కేసుల పెరుగుదలకు ఉన్న కారణాల్లో కీలకమైనది.. జన్యు మార్పిడికి లోనైన వివిధ రకాల వైరస్ లు భారత్ లోకి రావటం.. భారీగా జనాలు గుమిగూడే కార్యక్రమాలు కూడా కేసుల పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు చెప్పారు.

కరోనా నిబంధనల్ని పాటించే విషయాన్ని ప్రజలు పట్టించుకోవటం లేదని.. అందరూ కరోనా ముప్పు తప్పినట్లుగా భావిస్తున్నారని.. వ్యాక్సిన్ రావటంతో అందరిలో ధీమా పెరిగిపోయిందన్నారు. పెళ్లిళ్లు.. ఫంక్షన్లు పెద్ద ఎత్తున చేస్తున్నారని.. ఇలాంటి భారీ కార్యక్రమాలు సైతం.. కరోనా కేసుల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయన్నారు. కరోనా కట్టడిలో కీలకమైన ‘టెస్టింగ్.. ట్రాకింగ్.. ట్రీటింగ్’ పాలసీని ప్రభుత్వాలు వదిలేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా కేసుల పెరుగుదల రోజురోజుకి పెరుగుతున్న వేళ.. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే.. కరోనా కోరలకు చిక్కు ప్రమాదమే ఎక్కువన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News