తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న మోదీ భజన!

Update: 2016-09-17 04:35 GMT
ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ 66వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. అధికారంలో ఉన్న నాయకుడు గనుక.. ఆయన బర్త్‌డేను దేశవ్యాప్తంగా ఆయన పార్టీ వారు జరుపుకోవడంలో పెద్ద విశేషం ఏమీలేదు. ఆయన ప్రాపకం ఉంటే.. ఏదో ఒక మేలు జరుగుతుందని ఆశించే వాళ్లంతా.. మోదీ భజన కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోదీ భజన భారీ స్థాయిలో మోగబోతోంది. రెండు భారీ సభలు ఏర్పాటు అవుతున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గొప్ప ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు భారీ సన్మానం ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమం జరగబోతోంది. మోదీ జన్మదినం వేడుకల్ని కూడా ఇక్కడే నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఆ సభలో ఇక వక్తలంతా.. మోదీ ఆంధ్రప్రదేశ్‌ కు అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చేశాడంటూ ఆయన భజన మీద శ్రద్ధ పెట్టడం గ్యారంటీ.

అదే విధంగా తెలంగాణలో కూడా.. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ.. వరంగల్‌ లో ఓ భారీ బహిరంగసభను ఏర్పాటుచేసింది. సాక్షాత్తూ... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సభ మొత్తం కూడా మోదీ భజన మీద దృష్టి కేంద్రీకరిస్తుందని అనుకోవచ్చు. ఆ రకంగా రెండు తెలుగు రాష్ట్రాలూ బర్త్‌ డే సందర్భంగా మోడీని కీర్తించడంలో ఇవాళ బిజీ షెడ్యూళ్లతో ఉన్నాయని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News