కరోనా చికిత్స పై ఏపీ సర్కార్ కీలక మార్గదర్శకాలు !

Update: 2020-07-21 06:30 GMT
ఏపీలో రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలని విడుదల చేసింది. చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, టెస్టుల చార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ సూచించిన ఔషధాలపై ఉన్న ఎంఆర్పీ రేట్లనే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదై ఉన్న ఆస్పత్రులన్నీ ఈ ఔషధాల వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని తెలిపింది.

ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ తీవ్రతను తెలుసుకోవడానికి వాడే సీటీ స్కాన్‌ కూ గరిష్టంగా 2500 మాత్రమే వసూలు చేయాలని తెలిపింది.  అలాగే  అవసరం లేకపోయినా ఈ ఔషధాల అదనపు డోసులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అస్పత్రులని హెచ్చరించింది. అలాగే  ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు గతంలో ప్రభుత్వం సూచించిన ప్యాకేజీ ధరలకు అదనంగా అందించే చికిత్సను అనుసరించి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని , భారీగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఛాతీ ఎక్స్ రే, సీటీ స్కాన్ ‌లో ఉన్న మార్పులకు అనుగుణంగా  కరోనా పాజిటివ్ రోగిగానే గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని తెలిపింది.

అలాగే , గతంలో కరోనా క్రిటికల్ కేర్ చికిత్సకు మందులు, పరీక్షలు ఆహారం సహా రోజుకు 5480 నుంచి 10,380 రూపాయల వరకూ   ప్రభుత్వం నిర్దారించింది. నాన్ క్రిటికల్ కేర్‌కు రోజుకు 3250 చొప్పున మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే , ఇందులో భాగంగా సైటోకైన్‌ స్టార్మ్‌ సిండ్రోం ఉన్న దశలో తోసిలిజుమాంబ్‌ ఇంజక్షన్‌ వాడాలని సూచించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న కేసులకు ఫావిపిరావిర్‌ మాత్రలు ఇవ్వాలని స్పష్టం చేసింది. వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వాలని మార్గదర్శకాల్లో సూచించింది.
Tags:    

Similar News