ఆ సీఎం ట్వీట్ ను బాబు రీట్వీట్ చేశారెందుకు?

Update: 2018-04-09 05:09 GMT
ఒక ముఖ్య‌మంత్రి చేసిన ట్వీట్ ను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రీట్వీట్ ఎందుకు చేశారు? ఇంత‌కీ ఆ ట్వీట్ లో ఏముంది?  బాబును అంత‌గా ఆక‌ర్షించిన అంశం ఆ ట్వీట్ లో ఏముంద‌న్న‌ది చూస్తే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశారు.

హోదా సాధ‌న కోసం కేంద్ర స‌ర్కారుపై పోరాటం చేస్తున్న టీడీపీ ఎంపీలు.. నిన్న ప్ర‌ధాని నివాసం వ‌ద్ద మెరుపు నిర‌స‌న‌ను ప్లాన్ చేయ‌టం తెలిసిందే. హోదా సాధ‌న కోసం ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి.. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష కార‌ణంగా ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీల‌పై ఒత్తిడి పెరుగుతోంది. విప‌క్ష ఎంపీల మాదిరి త‌మ ప‌ద‌వుల‌కు ఎందుకు రాజీనామా చేయ‌రు? ఎందుకు  దీక్ష చేప‌ట్ట‌ర‌న్న ప్ర‌శ్న‌లు పెరుగుతున్నాయి.

ఇలాంటివేళ‌.. జ‌గ‌న్ పార్టీ ఎంపీల దీక్ష‌కు ధీటుగా తాము కూడా నిర‌స‌న చేప‌ట్టామ‌ని.. ఆందోళ‌న‌లు చేస్తున్నామ‌న్న క‌ల‌ర్ ఇచ్చేందుకు టీడీపీ ఎంపీలు పెద్ద సీనే క్రియేట్ చేశారు. ప్ర‌ధాని నివాసం ఎదుట నిర‌స‌న చేప‌ట్టాల‌ని.. ఆందోళ‌న‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా ప్ర‌ధాని నివాసం ఎదుట హ‌డావుడి చేసే ప్ర‌య‌త్నం చేశారు.

టీడీపీ ఎంపీల నిర‌స‌న‌ను అడ్డుకోవ‌టం కోసం ఢిల్లీ పోలీసులు క‌టువుగా వ్య‌వ‌హ‌రించారు. ఎంత‌కూ మాట విన‌ని టీడీపీ ఎంపీల ప‌ట్ల కొంత దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తూ వారిని అదుపులోకి తీసుకొని వాహ‌నాల్లో త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప‌రిణామాల‌పై ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ స్పందించారు. టీడీపీ ఎంపీల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌టాన్ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ త‌ప్పు ప‌ట్టారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కు తానుమ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌టం గ‌ర్హ‌నీయ‌మ‌ని త‌ప్పు ప‌ట్టారు. త‌మ ఎంపీల దీక్ష‌ను హైలెట్ చేసుకునేందుకు కిందా మీదా ప‌డుతున్న ఏపీ ముఖ్య‌మంత్రికి ఢిల్లీ ముఖ్య‌మంత్రి ట్వీట్ ఇప్పుడో అవ‌కాశంగా మారింది. ఈ కార‌ణంతోనే ఆయ‌న కేజ్రీవాల్ ట్వీట్ ను రీట్వీట్ చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News