హైటెక్ సీఎం బాబు మార్క్ మరో రికార్డు

Update: 2015-10-01 09:07 GMT
అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవటమే కాదు.. పాలనా సంస్కరణలు తీసుకురావటంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న పేరు ప్రఖ్యాతుల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే.. అప్పట్లో తనకు తాను సీఈవోగా చెప్పుకున్న చంద్రబాబు.. తర్వాత చూసిన రాజకీయ పల్లాలతో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబు.. గడిచిన పదహారు నెలలుగా విభజన కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. పాలనలో హైటెక్ విధానాల్ని ప్రోత్సహిస్తూ కొంగొత్తగా దూసుకెళ్లే చంద్రబాబు.. తాజాగా మరో ప్రయత్నం చేశారు. ఒకేసారి ఆరువేల మంది అధికారులతో కలిసి భారీ టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.

స్మార్ట్ ఏపీ కార్యక్రమంలో భాగంగా ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల్లో 6 వేల మందితో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైటెక్ ముఖ్యమంత్రిగా తనకున్న పేరు ప్రఖ్యాతుల్ని నిలుపుకుంటూ చేపట్టిన ఈ భారీ టెలికాన్ఫరెన్స్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News