హైదరాబాద్ టు విరాట్..ట్రంప్ ప్రసంగం అదుర్స్

Update: 2020-02-24 10:37 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆకట్టుకున్నారు. అహ్మదాబాద్ లో దిగాక మోతేరా స్టేడియంలో ప్రసంగించిన ట్రంప్ తనదైన శైలిలో లోకల్ టచ్ ఇచ్చారు. తన ప్రసంగంలో భారత్ గురించే ఆయన ప్రముఖంగా ప్రస్తావించడం ముచ్చట గొలిపింది. దాదాపు 30 నిమిషాలు ప్రసంగించిన ట్రంప్  హైదరాబాద్ మొదలుకొని స్వామి వివేకానంద దాకా.. బాలీవుడ్ లో మొదలు పెడితే షారుఖ్, షోలే వరకూ ప్రసంగించారు. ఇక క్రికెట్ గాడ్ సచిన్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల ప్రస్తావన తీసుకొచ్చారు.

అయితే ట్రంప్ వీరి పేర్లను సరిగ్గా పలకలేక ఆపసోపాలు పడ్డారు. కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ భారతీయులను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు.

ట్రంప్ ప్రసంగంలో స్వామి వివేకానందుడిని తలుచుకున్నారు. ఆయనలాంటి అసాధారణ వ్యక్తిత్వం భారతీయుల సొంతమని కొనియాడారు. చికాగోలో వివేకానందుడి ప్రసంగాన్ని తాను విన్నానని తెలిపాడు.

ఇక అమెరికా అధ్యక్షుడి నోటివెంట హైదరాబాద్ పదం రావడం విశేషం. మూడేళ్ల క్రితం తన కూతురు ఇవాంక హైదరాబాద్ సందర్శించిందని ట్రంప్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

ఇక మోడీపై ప్రశంసలు కురిపించారు. ఒక చాయ్ వాలాను ప్రధానమంత్రిగా చేసిన గొప్పతనం భారతీయులకు మాత్రమే సాధ్యపడిందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. చాయ్ వాలాను శక్తివంతుడైన నాయకుడిగా చేసిన భారతీయులు గొప్పవారని చెప్పుకొచ్చారు. భారతీయుల వ్యక్తిత్వమే వారిపై గౌరవభావాన్ని ప్రపంచం మొత్తం చూపించడానికి కారణమన్నారు.

ఇక బాలీవుడ్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. షారుఖ్ ఖాన్ - కాజల్ నటించి ‘దిల్ వాలే దుల్హానియా’ సినిమా గురించి కొనియాడారు. సంవత్సరానికి రెండు వేల సినిమాలను చిత్రీకరించే సామర్త్యం ప్రపంచంలోనే భారత్ కే ఉందన్నారు. వేరే ఏ దేశానికి ఇన్ని సినిమాలు తీసే శక్తి లేదన్నారు.

ఇక టాప్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ - విరాట్ కోహ్లీలను ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. క్రీడారంగంలో కూడా శాసించదగ్గ ఆటగాళ్లు భారత్ సొంతమని పేర్కొన్నారు.

మొత్తంగా ట్రంప్ తన ప్రసంగంలో భారత్ లోని అన్ని వర్గాలు, ప్రముఖులను గుర్తు చేసి భారతీయులను ఫిదా చేశారనే చెప్పాలి.


Tags:    

Similar News