నిర్ణయం మార్చుకోని 'ఎర్రబెల్లి'..: జంప్ ఖాయమే..?

Update: 2022-08-04 14:30 GMT
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా విషయంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు తగ్గేదేలే అంటున్నాడు.. దీంతో  బీజేపీలో చేరడం ఖాయమనే తెలుస్తోంది. ఆయన రాజీనామా చేయొద్దని పలువురు టీఆర్ఎస్ ప్రముఖులు బుజ్జగించినా వినడం లేదు. ప్రత్యేకంగా చర్చలు పెట్టినా ఫలించడం లేదు. ఇన్నాళ్లు ఎన్నో అవమానాలు భరించానని.. ఇక టీఆర్ఎస్ లో కొనసాగితే తనకు భవిష్యత్ ఉండదని ప్రదీప్ రావు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెల్లి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  ఫలితంగా వరంగల్ టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడైన ప్రదీప్ రావు ఉన్నఫలంగా బీజేపీలో చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది.

 తెలంగాణ ఉద్యమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నానని, ఆ తరువాత టీఆర్ఎస్లో చేరితే కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా అవమానించారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తన సన్నిహితుల వద్ద వాపోయారు.

తాను ఏర్పాటు చేసిన తెలంగాణ నవ నిర్మాణ సమితి పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశానన్నారు.అయినా కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇప్పిస్తానని చెప్పి రెండు సార్లు ఇవ్వకుండా అవమానించారన్నారు. రాజకీయంగా కష్టపడి పనిచేసినా అవకాశం ఇవ్వలేదన్నారు.

అయితే ప్రదీప్ రావు రాజీనామా అంశం తెరపైకి రావడంతో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు బస్వరాజు సారయ్య చర్చలు జరిపారు. ఆయనతో పాటు రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ లు కలిసి ప్రదీప్ రావు ఇంటికి వెళ్లినా ఆయన వినలేదు. అవసరమైతే కేసీఆర్ తో మాట్లాడిస్తామని చెప్పారు. అయినా ప్రదీప్ రావు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలే అని భీష్మించుకు కూర్చున్నారు.

ప్రదీప్ రావు వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తత పరిస్థితులు చూస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కష్టమేనని భావిస్తున్నారు. అటు  కాంగ్రెస్ తరుపున కొండా సురేఖ లేదా వేం నరేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య తనకు టికెట్ ఇచ్చే పార్టీలోకి మారాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ తరుపున బలమైన అభ్యర్థి లేరు. అంతేకాకుండా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ తరుపున కోరనున్నారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువయ్యారు. గతంలో బస్వరాజు సారయ్య స్థానంలో తనకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అనుకున్నారు. అయితే ఆ సమయంలో ప్రదీప్ రావును బుజ్జగించారు.  ఆ తరువాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారు. అదీ జరగలేదు. దీంతో ఇక పార్టీలో కొనసాగడం కష్టమని ప్రదీప్ రావు తన సన్నిహితులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.
Tags:    

Similar News