బ్రేకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ ..!

Update: 2019-11-30 07:34 GMT
దేశీయ ఆర్థిక వృద్ది ఊహించిన దాని కంటే కనిష్టానికి పడిపోయింది. దేశం మాంద్యంలోకి జారిపోతోందన్న నిపుణుల హెచ్చరికలు  నిజమౌతున్నాయేమో అని అనిపిస్తుంది. దీనిపై ఆందోళన మొదలైంది. గత త్రైమాసికంగా 5.1 శాతం ఉన్న జీడీపీ.. ప్రస్తుత త్రైమాసికంలో 4.5 శాతానికి పడిపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలేవీ ఫలితాన్నివ్వడం లేదని... అసలు కేంద్రం దగ్గర మందగమనాన్ని ఎదుర్కునే వ్యూహమే లేదని విపక్షనేతలు - నిపుణులు ఆరోపిస్తున్నారు. దీనిపై సరైన నిర్ణయం తీసుకోకపోతే ..ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నిపుణులు కొంతమంది హెచ్చరిస్తున్నారు.

ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక వృద్ధిలో మందగమనం ఉంది కానీ మాంద్య పరిస్థితులు లేవని - పురోగతికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం  ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీడీ ఆరున్నర సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ  4.5 శాతం వృద్ధిని సాధించినట్లు నేషనల్ స్టాటిస్టికల్ విభాగం శుక్రవారం వెల్లడించింది.  ముఖ్యంగా తయారీ రంగం పూర్తిగా మందగించింది. ప్రభుత్వం ఎన్ని ఉద్దీపనలిచ్చినా.. ఆ రంగం కోలుకోలేదు. కోర్ రంగంగా చెప్పుకునే 8 మౌలిక సదుపాయాల సూచీల్లో ఆరు సూచీలు నేల చూపులు చూడటంతో.. జీడీపీ తగ్గిపోతోంది. విద్యుత్ - బొగ్గు రంగాల సూచీలు ఏకంగా రెండంకెల స్థాయిలో దిగజారడం.. జీడీపీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
Tags:    

Similar News