మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు తప్పవా..?

Update: 2017-12-18 17:25 GMT
మోదీ మంత్రివర్గంలో పనిచేసినవారు ముఖ్యమంత్రులవుతున్నారు. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన మనోహర్ పారికర్ అంతకుముందు గోవా సీఎంగా పనిచేయగా అక్కడి నుంచి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే.. మొన్నటి గోవా ఎన్నికల తరువాత పారికర్‌ ను మళ్లీ గోవాకు పంపారు. అలాగే... శర్వానంద సోనోవాల్‌ను అస్సాం సీఎంగా పంపించారు. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను హిమాచల్ ప్రదేశ్ సీఎం చేయడానికి మోదీ సిద్ధమవుతున్నారు. హిమాచల్‌ లో బీజేపీ గెలిచినా అక్కడ బీజేపీ సీఎం అభ్యర్థి అయిన మాజీ సీఎం ప్రేమ్ కుమార్ దుమాల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను హిమాచల్ సీఎంగా పంపుతారని తెలుస్తోంది.
    
నిజానికి ఎన్నికలకు ముందే నడ్డాను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నారట. కానీ.. కొంత వ్యతిరేకత రావడం..ఇతర కారణాల వల్ల మళ్లీ ధుమాల్‌ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కానీ, ఆయన ఇప్పుడు ఓడిపోవడంతో జేపీ నడ్డానే సీఎం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
    
అదే జరిగితే మంత్రివర్గంలో ఒక బెర్తు ఖాళీ అవుతుంది. కేంద్రంలో మంత్రి పదవులు ఆశించేవారు ఉండడం... వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అవసరాల నేపథ్యంలో ఈ ఖాళీని భర్తీ చేస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే నడ్డాను కేంద్రం నుంచి రాష్ర్టానికి పంపించడం ఖాయమని చెప్తున్నారు.
    
నడ్డాను సీఎం చేయాలని ప్రధాని మోదీ - పార్టీ చీఫ్‌ అమిత్‌ షా ఆసక్తి చూపుతున్నారు. అయితే... ధుమాల్ ఓటమితో హిమాచల్ బీజేపీలో సీఎం సీటును కోరుకుంటున్న నేతల సంఖ్య భారీగానే ఉందని తెలుస్తోంది. కానీ... అగ్రనేతలతో సాన్నిహిత్యం నడ్డాకు కలిసిరానుంది.
Tags:    

Similar News