నువ్వంటే నువ్వే కారణం.. తన్నుకోబోయిన గ్యాంగ్ రేప్ నిందితులు!

Update: 2022-06-14 05:30 GMT
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన రొమేనియా బాలిక గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితులైన మైనర్లు సైదాబాద్‌లోని జువనైల్‌ హోమ్‌లో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. జూన్ 12న ఆదివారం వీరితో క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌ చేసిన తర్వాత జువనైల్‌ హోమ్‌లో ఇది జరిగినట్లు సమాచారం. ఈ దుస్థితిలో తాము ఇరుక్కోవడానికి కారణం నువ్వంటే నువ్వంటూ ఒకరినొకరు తిట్టుకున్నారని తెలిసింది. హోమ్‌లో భోజనాలు చేసే సమయంలో మైనర్ల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం.

తాము జువైనల్ హోమ్ బారిన పడటానికి, పరిస్థితులు ఇక్కడి వరకు రావడానికి, అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వంటే నువ్వంటూ ఒకరిపై ఒకరు నిందితులు తీవ్ర విమర్శలు చేసుకున్నారని సమాచారం. మైనర్లు ఓ దశలో భోజనం ప్లేట్లతో పరస్పరం దాడి చేసుకోవడానికి ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది.

కాగా ఈ కేసులోని ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్‌ మాలిక్‌ మేజర్‌ కాగా, మిగిలిన ఐదుగురిలో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడు, పొరుగు జిల్లాకు చెందిన కార్పొరేటర్‌ కుమారుడితోపాటు రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్‌కు చెందిన బాలుడు, హైదర్‌గూడకు చెందిన బాలుడు మైనర్లు.

ఈ మైనర్లను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువనైల్‌ కోర్టు వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నప్పుడు.. అంతకుముందు పోలీసుల విచారణలో ఈ మైనర్లు ఒకరిపై ఒకరు తప్పు నెట్టుకునే ప్రయత్నం చేశారు.

కాగా ఏసీపీ మంత్రి సుదర్శన్‌ నేతృత్వంలోని బృందం సోమవారం విచారణ చేపట్టి నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసింది. ఆ సందర్భంగా మైనర్ల మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరగలేదని అధికారులు చెప్తున్నారు. జూన్ 14న మంగళవారంతో ఐదుగురు నిందితుల కస్టడీ గడువు ముగియనుంది.

ఇప్పటికే ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ కస్టడీ పూర్తి కావడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో కోర్టుల అనుమతితో ఈ ఆరుగురికీ రెండు, మూడు రోజుల్లో వేర్వేరుగా టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News