ఓవైసీకి ప్రతిసవాల్ విసిరిన కిషన్ - లక్ష్మణ్

Update: 2018-09-16 10:28 GMT
తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో ప్రచారాన్ని మొదలుపెట్టగా.. తాజాగా బీజేపీ సమరశంఖం పూరించింది. పాలమూరు నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమ ప్రచారాన్ని ప్రారంభించాడు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో విభిన్న వ్యూహాలు - ఎత్తుగడలో షా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. అంతేకాదు.. అధికార టీఆర్ ఎస్ - మజ్లిస్ అనధికార పొత్తుపై మాటల తూటాలు పేల్చారు. ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీని ‘అభినవ రజాకార్’ అంటూ విమర్శించారు.

దీనికి కౌంటర్ గా అమిత్ షాకు గట్టి సమాధానం ఇచ్చాడు ఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు ఆయన  చేసిన ట్వీట్ ఇప్పుడు బీజేపీ-ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఓవైసీ ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ లో తనపై పోటీచేయాలని.. ఓటమి అంటే ఎంటో రూచిచూపిస్తానని’ సవాల్ విసిరారు. జాతీయాధ్యక్షుడు పోటీ చేసినా విజయం ఎంఐఎందేనని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 5 సీట్లు కూడా బీజేపీ మళ్లీ దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు. ముందు పెట్రోల్ ధరలు - ఉద్యోగ కల్పనపై బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శించారు..

అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అమిత్ షా దాకా ఎందుకు ఓవైసీకి దమ్ము - ధైర్యం ఉంటే అంబర్ పేటలో తనపై పోటీచేసి గెలవాలని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం మజ్లిస్ పై మండిపడ్డారు. ఓవైసీపై ఓ సామాన్య కార్యకర్తను బరిలో నిలిపి హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. మజ్లిస్ ను టీఆర్ ఎస్ - టీడీపీ పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచాయని విమర్శించారు.  టీఆర్ ఎస్ ను బీజేపీ సింగిల్ గా.. సింహంలా ఎదుర్కొంటుందని లక్ష్మణ్ సవాల్ చేశారు.
   

Tags:    

Similar News